CM Revanth Reddy: కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపించాలి
ABN, Publish Date - Jan 16 , 2025 | 03:35 AM
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలంటూ కృష్ణా ట్రైబ్యునల్-2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
నీటి కేటాయింపులపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన
‘గోదావరి-బనకచర్ల’పై అభ్యంతరాలతో కేంద్రానికి, ఏపీ సీఎంకు లేఖలు రాయాలి
పోలవరం ముంపుపై ఐఐటీ అధ్యయనాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలి
నీటి పారుదల శాఖ సమీక్షలో ఆదేశాలు
న్యూఢిల్లీ, జనవరి 15(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలంటూ కృష్ణా ట్రైబ్యునల్-2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖపై ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందని.. ఆ చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌనిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగానే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించిందని.. ట్రైబ్యునల్ తదుపరి విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినాస్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులూ లేకుండా ‘గోదావరి-బనకచర్ల’ అనుసంధాన ప్రాజెక్టు చేప్టటడంపై అభ్యంతరాలు తెలుపుతూ.. కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు, ఏపీ సీఎం చంద్రబాబుకు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు (జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ) లేఖలు రాయాలని ఆదేశించారు. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో అధ్యయనం అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇక.. గురువారం నుంచి రెండు రోజులపాటు కృష్ణా ట్రైబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాదులు వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారయణన్కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ప్రతిపాదనకు గత బీఆర్ఎస్ సర్కారు సూచనప్రాయంగా ఒప్పుకుందని ఆయన మీడియాతో అన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని.. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున మెజారిటీ టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు. కాగా.. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.
Updated Date - Jan 16 , 2025 | 03:35 AM