Hanumakonda: పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య
ABN, Publish Date - Jan 23 , 2025 | 04:12 AM
పట్ట పగలు.. నగరం నడిబొడ్డున.. జన సంచారంతో, వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న ప్రధాన రహదారిపై.. ఓ ఆటో డ్రైవర్ను మరో ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి చంపేశాడు.
ఓ ఆటోడ్రైవర్ని పొడిచి చంపిన మరో ఆటోవాలా
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఘాతుకం
హనుమకొండ అదాలత్ జంక్షన్లో ఘటన
హనుమకొండ టౌన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పట్ట పగలు.. నగరం నడిబొడ్డున.. జన సంచారంతో, వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న ప్రధాన రహదారిపై.. ఓ ఆటో డ్రైవర్ను మరో ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి చంపేశాడు. హనుమకొండ సుబేదారి పోలీ్సస్టేషన్ పరిధిలోని అదాలత్ జంక్షన్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిందీ దారుణం. కళ్లముందే జరిగిన ఈ హత్యతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన మాచర్ల రాజ్కుమార్ (45) స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకొంటూ జీవించే అతడికి.. భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే.. మడికొండ అయోధ్యపురానికి చెందిన ఈనుగు వెంకటేశ్వర్లు అదే ప్రాంతంలో ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నిరోజులుగా వివాహేతర సంబంధం ఉంది.
ఇటీవలికాలంలో రాజ్కుమార్ కూడా ఆమెతో సన్నిహితంగా ఉండడం గమనించి.. వెంకటేశ్వర్లు అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఆ మహిళ జోలికి రావొద్దని పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంపై ఇద్దరూ కొన్నిసార్లు గొడవ కూడా పడ్డారు. కొద్దిరోజులుగా ఆ మహిళ తనను దూరం పెట్టడంతో.. అందుకు కారణం రాజ్కుమారే అని భావించిన వెంకటేశ్వర్లు ఆ ఇద్దరిపై కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉదయం రాజ్కుమార్ ఆటోను వెంబడించి హనుమకొండ అదాలత్ జంక్షన్ సమీపంలో అడ్డగించి అతడితో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో.. వెంకటేశ్వర్లు తన ఆటోలో ఉన్న కత్తి తీసి రాజ్కుమార్పై దాడి చేశాడు. అతడు కిందపడిపోగానే కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. అతడి చేతిలో కత్తి ఉండటం, తీవ్ర ఆవేశంతో ఉండటంతో.. అతణ్ని ఆపితే తమకేమన్నా అవుతుందనే భయంతో అడ్డుకునేందుకు తొలుత ప్రయత్నించలేదు.
కొంతమంది ఈ దారుణాన్ని సెల్ఫోన్లలో వీడియో తీస్తుండగా.. ఒక వ్యక్తి వెంకటేశ్వర్లును ఆపేందుకు ప్రయత్నించేటప్పటికే రాజ్కుమార్ తీవ్రగాయాలతో కిందపడిపోయాడు. అప్పుడు కొందరు స్థానికులు వెంకటేశ్వర్లును పట్టుకుని దేహశుద్ధి చేసి.. తాళ్లతో కట్టేసే యత్నం చేశారు. ఈ లోపు సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న సుబేదారి పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో స్పృహలేకుండా ఉన్న రాజ్కుమార్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. కాగా.. రాజ్కుమార్పై వెంకటేశ్వర్లు దాడి దృశ్యాలను కొంతమంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
Updated Date - Jan 23 , 2025 | 04:12 AM