kumaram bheem asifabad- సరిహద్దు గ్రామాలను తెలంగాణలో కొనసాగించాలి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:20 PM
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు.
ఆసిఫాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కెరమెరి మండలంలోని అంతాపూర్, ఇంద్రా నగర్, పద్మావతి, నారాయణగూడ, పరందోళి(మహారాజ్గూడ) గ్రామాల్లో 50 సంవత్సరా లుగా నివసిస్తున్నామని చెప్పారు. తమ గ్రామాల సరిహద్దు సమస్య వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం నుంచి అటవీ హక్కు పత్రాలు, రేషన్ కార్డులు, ఓటరు కార్డులు, కులధ్రువీకరణ పత్రాలు పొంది ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దు గ్రామాలు తెలంగాణవే
కెరమెరి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పరందోళి, మొక్దంగూడ, అంతాపూర్, బోలాపటార్, ఎస్సాపూర్, నారాయణ్గూడతో పాటు సరిహద్దు గ్రామాలన్నీ తెలంగాణ ప్రాంతానివే అని మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం అన్నారు. మండల కేంద్రంలోని గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ బుధవారం ముంబయిలో మాట్లాడుతూ ఏకపక్షంగా పరందోళితో పాటు సరిహద్దు గ్రామాలన్నింటినీ మహారాష్ట్రలో కలుపుకుంటామని ఆనడం సరికాదన్నారు. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చినవని తెలిపారు. రాష్ట్రాల సరిహద్దుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా అనడం సరికాదని చెప్పారు. పరందోళి, అంతాపూర్ అటవీ విస్తీర్ణం అంతా తెలంగాణ ప్రాంతానికి చెందుతుందని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే గ్రామాలు విలీనం చేసుకోవాల కోరారు. వివాదస్పద వ్యాఖ్యలు సరికాదని తెలిపా రు. సమావేశంలో నాయకులు మోతిరాం, యూనుస్, అంబాజీ, రూప్లాల్నాయక్, జగన్నాథ్రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:20 PM