బరస్తాన్లో బయటపడిన పురాతన రాగి పత్రాలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:59 AM
ఖబరస్తాన్(శ్మశానవాటిక)లో గుంత తవ్వుతుండగా మట్టి కుండలో రాగి పత్రాలు లభ్యమయ్యాయి.
మృతదేహాన్ని పూడ్చేందుకు గుంత తవ్వుతుండగా లభ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘటన
సూర్యాపేట జిల్లా కోదాడలో బయటపడిన రాగి పత్రాలు
కోదాడ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఖబరస్తాన్(శ్మశానవాటిక)లో గుంత తవ్వుతుండగా మట్టి కుండలో రాగి పత్రాలు లభ్యమయ్యాయి. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్రెడ్డి వెల్లడించారు. కోదాడలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పూడ్చేందుకు ముస్లిం శ్మశాన వాటికలో గుంత తవ్వారు. ఓ మట్టికుండ కనిపించడంతో వక్ఫ్ బోర్డు సభ్యుడు జబ్బార్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తేజ్సనందలాల్ ఆదేశాల మేరకు ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాహీద్లు శ్మశాన వాటికకు చేరుకుని మట్టికుండను పంచనామా చేశారు. మట్టి కుండలో తొమ్మిది కడియాలకు బిగించిన రాగి పత్రాలు ఉండగా, వాటిపై తమిళం, సంస్కృతంలో రాసిన పదాలను గుర్తించారు. రాగి పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, మట్టి కుండలో లభించిన రాగి పత్రాలను పురావస్తు శాఖకు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాహిద్లు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:59 AM