ఆత్మీయ భరోసా ఇంకెప్పుడు?
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:37 PM
ఈ వర్షాకాలానికి సంబంధించి పంటల సాగుకు భూమి కలిగిన ప్రతీ రైతుకు రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎకరాకు ఆరువేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి సాయం అందజేసింది.
- ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న అర్హులు
- జిల్లాలో 19,082 మంది గుర్తింపు
చింతలమానేపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాలానికి సంబంధించి పంటల సాగుకు భూమి కలిగిన ప్రతీ రైతుకు రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎకరాకు ఆరువేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి సాయం అందజేసింది. జిల్లాలో ఈ పథకం కింద 1.21 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. దీంతో రైతులు పంటల సాగులో బిజీగా మారారు. మరో వైపు భూమి లేని నిరు పేదలకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నా రు. అర్హుల జాబితా ఇప్పటికే రూపొందించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అర్హులు నిరాశ చెందుతున్నారు.
- జిల్లాలో ఇలా..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం రేషన్ కార్డును యూనిట్గా సెంటు భూమి లేని నిరుపేదలను అర్హులుగా గుర్తించారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి ఉండాలి. అయితే కుటుంబంలో యజమానిగా ఎవరు ఉన్నా సదరు కుటుంబంలోని మహిళను ప్రభుత్వం లబ్ధిదారుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ లెక్కన జిల్లాలో 19,082 మంది అర్హులకు సాయం అందించాలని అధికారులు జాబితాను రూపొందించారు. మొదటి విడత నగదు సాయం ఆరు వేల రూపాయల నగదును ఈ ఏడాది జనవరి 26 తేదీన జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పథకాల అమలు కోసం మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. జిల్లాలో 15 గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే నగదు జమ చేశారు. మిగిలిన అర్హులకు మార్చి 31 వరకు జమ చేస్తామని పలు మార్లు ప్రజాప్రతినిధులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. రెండోవిడత సాయం అందించాల్సిన సమయం వచ్చినా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అయితే ఇటీవల రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో అర్హులు ఆత్మీయ భరోసాపై ఆశలు పెట్టుకున్నారు.
మండలాల వారీగా అర్హులు ఇలా...
మండలం అర్హుల సంఖ్య
చింతలమానేపల్లి 647
కౌటాల 1916
బెజ్జూరు 1347
పెంచికలపేట 358
సిర్పూర్(టీ) 1023
సిర్పూర్(యూ) 286
కాగజ్నగర్ 1482
దహెగాం 1072
రెబ్బెన 976
తిర్యాణి 1353
వాంకిడి 1570
జైనూరు 1398
లింగాపూర్ 695
కెరమెరి 2714
Updated Date - Jul 03 , 2025 | 11:37 PM