బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:02 PM
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
- ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కారం కోసం సంబంధింత సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా చూడాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రత పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తోందని ఎస్పీ తెలిపారు.
హోంగార్డ్స్, సిబ్బంది సంక్షేమానికి చర్యలు
హోంగార్డు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకేట్స్, రెయిన్ కోట్స్ను జిల్లా పోలీసు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారన్నారు. హోంగార్డ్స్లకు, సిబ్బందికి సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జి విద్యాసాగర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం
జిల్లాలో పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. లింగాపూర్ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ గణేష్ నాయక్ ఏప్రిల్ 4న గుండెపోటుతో మృతి చెందగా ఆయన సతీమణికి భద్రత ఎక్స్గ్రేషియా రూ.8 లక్షలు, కార్పస్ ఫండ్ కింద లక్ష రూపాయలు మొత్తం రూ.9 లక్షల చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కును సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సీఐ రాణా ప్రతాప్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ్శంకర్రెడ్డి, ఆర్ఐ అడ్మిషన్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యం
ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. పదవీ విరమణ పొందుతున్న ఎస్సై రాజయ్యను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్గా నియామకమై 35 సంవత్సరాల సర్వీసులో వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారన్నారు. సర్వీసు మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా హెడ్కానిస్టేబుల్, ఏఎస్సై, సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారని కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు విజయశంకర్రెడ్డి, స్పెషల్ బ్రాంచి సీఐ రాణా ప్రతాప్, ఆర్ఐ అంజన్న, ఎస్సై రాజయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:02 PM