వైభవంగా వైశాఖ పౌర్ణమి జాతర
ABN, Publish Date - May 12 , 2025 | 11:30 PM
వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి దేవస్థానంలో సోమవారం వైభవంగా వైశాఖ పౌర్ణమి జాతర జరిగింది.
- సత్యదేవుడిని దర్శించుకున్న భక్తజనం
- భక్తిశ్రద్ధలతో సామూహిక వ్రతాలు
దండేపల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి దేవస్థానంలో సోమవారం వైభవంగా వైశాఖ పౌర్ణమి జాతర జరిగింది. ఉదయం నుంచే పలు జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు గూడెం గుట్టకు తరలివచ్చి సత్యదేవుడిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సమీపంలో గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకొని సత్యదేవుడిని, పంచముఖ అంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో భక్తులు కుటుంబసమేతంగా నిత్యపూజలు, ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. 320మందికి పైగా భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Updated Date - May 12 , 2025 | 11:30 PM