అధైౖర్య పడొద్దు.. అండగా ఉంటా
ABN, Publish Date - May 26 , 2025 | 11:18 PM
పోడు రైతులు ఎవరు అధైర్య పడొద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు
పెంచికలపేట, మే 26 (ఆంధ్రజ్యోతి): పోడు రైతులు ఎవరు అధైర్య పడొద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. సోమవారం మండలంలోని జైహింద్పూర్ గ్రామ శివారులో బెజ్జూరు అటవీ శాఖాధికారులు పోడు భూములను చదును చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా పోడు రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఇందులో మొక్కలు నాటడం అన్యాయమని అడ్డుకున్నారు. పోడు రైతుల ద్వారా విషయం తెలుసుకొని ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ పోడు రైతుల సాగును అడ్డుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. పోడు వ్యవసాయం అడ్డుకుని రైతులను ఇబ్బంది పెట్టే వారి జీవనోపాధికి అంతరాయం కలిగించవద్దని అధికారులకు సూచించారు. రెండురోజుల క్రితం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంవత్సరం పోడు భూముల్లో చెట్లు నాటేది లేదని అటవీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మంత్రి వ్యాఖ్యలకు అనుగుణంగా చర్యలు తీసుకొని పోడు రైతులకు సహకరించాలని ఆయన సూచించారు. కొత్తగా అటవీ భూమిని ఆక్రమించవద్దని రైతులకు చెప్పారు. కార్యక్రమంలో బెజ్జూరు ఎఫ్ఆర్వో శ్రావణ్కుమార్, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు కొమురయ్య, ప్రవీణ్, విక్రమ్,మహేందర్, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
Updated Date - May 26 , 2025 | 11:18 PM