రెండేళ్లలో తొలి డైమండ్ టైటిల్
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:06 AM
భారత సూపర్ స్టార్ నీరజ్ చోప్రా రెండు సంవత్సరాల తర్వాత డైమండ్ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పారిస్ డైమండ్ లీగ్ జావెలిన్ త్రోలో అతడు విజేతగా...
పారిస్ లీగ్ విజేత నీరజ్
పారిస్: భారత సూపర్ స్టార్ నీరజ్ చోప్రా రెండు సంవత్సరాల తర్వాత డైమండ్ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పారిస్ డైమండ్ లీగ్ జావెలిన్ త్రోలో అతడు విజేతగా నిలిచాడు. ఈక్రమంలో జర్మనీకి చెందిన తన ప్రధాన ప్రత్యర్థి జులియన్ వెబర్ను వెనక్కు నెట్టాడు. అయితే 90 మీటర్ల మార్క్ను మరోసారి అందుకోవడంలో మాత్రం నీరజ్ విఫలమయ్యాడు. మొత్తం ఏడుగురు అథ్లెట్లు తలపడిన పోరులో..తొలి ప్రయత్నంలోనే 88.16 మీ. దూరం ఈటెను విసిరిన చోప్రాకు టైటిల్ దక్కింది. ఇక.. రెండో రౌండ్లో 85.10 మీ. విసిరిన నీరజ్ తర్వాతి మూడు యత్నాలలో ఫౌల్ చేశాడు. ఇక ఆరో, చివరి రౌండ్లో 82.89 మీ. దూరం చోప్రా నమోదు చేశాడు. తొలి ప్రయత్నంలోనే 87.88 మీ. దూరం జావెలిన్ను విసిరిన వెబర్ రెండో స్థానంలో నిలిచాడు. డ సిల్వా (బ్రెజిల్, 86.62 మీ.) మూడో స్థానం సాధించాడు. గత మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో నీరజ్ (90.23 మీ.) కెరీర్లో తొలిసారి 90మీ. మార్క్ను చేరుకున్నా..రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 91.06 మీ. దూరం నమోదు చేసిన వెబర్ దోహాలో విజేతగా నిలిచిన విషయం విదితమే. కాగా..చోప్రా చివరిసారి 2023లో లాసన్నే డైమండ్ లీగ్లో టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్లో 7 వికెట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 05:06 AM