ODI Series: ఆ ముగ్గురు అదరగొట్టారు
ABN, Publish Date - Aug 16 , 2025 | 04:54 AM
ఓపెనర్ యాస్తిక భాటియా (66), కెప్టెన్ రాధా యాదవ్ (60), తనూజా కన్వర్ (50) అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో వన్డే సిరీ్సను భారత్ ‘ఎ’ టీమ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
యాస్తిక, రాధ, తనూజ హాఫ్ సెంచరీలు
భారత మహిళలదే వన్డే సిరీస్
బ్రిస్బేన్: ఓపెనర్ యాస్తిక భాటియా (66), కెప్టెన్ రాధా యాదవ్ (60), తనూజా కన్వర్ (50) అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో వన్డే సిరీ్సను భారత్ ‘ఎ’ టీమ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన రెండో మ్యాచ్లో 2 వికెట్లతో ఆతిథ్య జట్టును ఓడించింది. మొదట ఆసీస్ 50 ఓవర్లలో 265/9 స్కోరు చేసింది. అలీసా హీలీ (91), కిమ్ గార్త్ (41 నాటౌట్) రాణించారు. స్పిన్నర్ మిన్ను మణి 3, పేసర్ సైమా ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ‘ఎ’ 49.5 ఓవర్లలో 266/8 స్కోరు చేసి గెలిచింది.
ప్రేమా రావత్ (32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఎడ్గర్, హేవార్డ్, జార్జియా తలా 2 వికెట్లు తీశారు. ఛేదనలో 83/4తో ఇబ్బందుల్లో పడిన దశలో రాధ, యాస్తిక ఐదో వికెట్కు 68 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఓ దశలో మనోళ్లు 193/7 స్కోరుతో ఉండడంతో ఓటమి తప్పదేమోననిపించింది. అయితే తనూజ, ప్రేమ ఒత్తిడిని అధిగమించి ఎనిమిదో వికెట్కు 68 రన్స్ జోడించడం ద్వారా జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఆస్ట్రేలియా ‘ఎ’: 50 ఓవర్లలో 265/9 (అలీసా 91, గార్త్ 41 నాటౌట్, మిన్ను మణి 3/46, సైమా ఠాకూర్ 2/30).
భారత్ ‘ఎ’: 49.5 ఓవర్లలో 266/8 (యాస్తిక 66, రాధ 60, తనూజా 50, ప్రేమ 32 నాటౌట్, అమీ 2/55, ఎలా హేవార్డ్ 2/57, జార్జియా 2/68).
Updated Date - Aug 16 , 2025 | 04:54 AM