Lords Test 2025: బజ్బాల్ను పక్కనబెట్టి
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:23 AM
బజ్బాల్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లండ్ లార్డ్స్ టెస్టులో మాత్రం నెమ్మదించింది. అటు భారత బౌలర్లు విశేషంగా రాణించినప్పటికీ.. నాలుగు వికెట్లతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా...
ఆచితూచి ఆడిన ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్ 251/4
రాణించిన పోప్, స్టోక్స్
నితీశ్కు రెండు వికెట్లు
భారత్తో మూడో టెస్టు
లండన్: బజ్బాల్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లండ్ లార్డ్స్ టెస్టులో మాత్రం నెమ్మదించింది. అటు భారత బౌలర్లు విశేషంగా రాణించినప్పటికీ.. నాలుగు వికెట్లతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్దే ఒకింత పైచేయి అయింది. బ్యాటింగ్కు కష్టంగా మారిన పిచ్పై జో రూట్ (99 బ్యాటింగ్) పట్టుదలగా ఆడాడు. అతడి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆట ముగియగా, పోప్ (44), కెప్టెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్) సహకరించారు. దీంతో గురువారం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 251/4 స్కోరుతో నిలిచింది. నితీశ్కు రెండు.. బుమ్రా, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.
నితీశ్ ‘డబుల్’: టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను నిలడగా ఆరంభించింది. కొత్త బంతితో భారత పేసర్లు స్వింగ్తో పాటు ఎక్స్ట్రా బౌన్స్తో ఇబ్బందిపెట్టినప్పటికీ ఓపెనర్లు డకెట్ (23), క్రాలే (18) ఓపిగ్గా ఆడారు. దీంతో తొలి గంటలో వీరు 13 ఓవర్లలో 39 పరుగులు జత చేశారు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత కెప్టెన్ గిల్ బంతిని నితీశ్కు ఇవ్వడం ఫలితాన్నిచ్చింది. తన తొలి ఓవర్లోనే డకెట్ను అవుట్ చేశాడు. పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో తొలి వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బంతికే పోప్ కూడా డకౌట్ అయ్యేవాడే కానీ.. గల్లీలో క్లిష్టమైన క్యాచ్ను గిల్ వదిలేశాడు. అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి క్రాలే సైతం పంత్కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసిన నితీశ్ భారత్కు ఊరటనిచ్చాడు. కానీ 44/2 స్కోరుతో ఇబ్బందిపడిన జట్టును రూట్-పోప్ జోడీ ఆదుకుంది. బౌలర్లకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా వీరు లంచ్ బ్రేక్కు వెళ్లారు. ఈ సెషన్లో ఇంగ్లండ్ 83 పరుగులు సాధించింది.
శతక భాగస్వామ్యం: రెండో సెషన్లో భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా వికెట్ సాధించలేకపోయారు. బజ్బాల్ గేమ్ను పక్కనబెట్టి రూట్-పోప్ జోడీ అసలు సిసలు టెస్టు ఆటను ప్రదర్శించింది. చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేసిన పేసర్ల ధాటికి ఓ దశలో 28 బంతులపాటు ఇంగ్లండ్ ఒక్క పరుగు కూడా సాధించలేదు. అవుట్సైడ్కు ఆవల వేసే బంతులను తెలివిగా వదిలేస్తూ ఆడారు. అటు నితీశ్ ఓవర్లో ఫోర్తో రూట్ అర్ధసెంచరీని సైతం పూర్తి చేశాడు. ఓవరాల్గా ఈ సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 70 పరుగులు రాబట్టింది. అయితే భారత బౌలర్లను విసిగిస్తున్న ఇంగ్లండ్ జోడీకి స్పిన్నర్ జడేజా చెక్ పెట్టాడు. ఆఖరి సెషన్ ఆరంభమైన తొలి బంతికే సబ్స్టిట్యూట్ కీపర్ జురెల్కు పోప్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బ్రూక్ (11)ను బుమ్రా బౌల్డ్ చేసినా.. స్టోక్స్తో కలిసి రూట్ జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్కు అజేయంగా 79 పరుగులు జోడించాక ఈ జోడీ తొలి రోజును ముగించింది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి సబ్) జురెల్ (బి) జడేజా 44; రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్ట్రాలు: 17; మొత్తం: 83 ఓవర్లలో 251/4. వికెట్ల పతనం: 1-43, 2-44, 3-153, 4-172. బౌలింగ్: బుమ్రా 18-3-35-1; ఆకాశ్ 17-2-75-0; సిరాజ్ 14-5-33-0; నితీశ్ 14-0-46-2; జడేజా 10-1-26-1; సుందర్ 10-1-21-0.
1
భారత్పై టెస్టుల్లో 3 వేల పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా జో రూట్.
ఎంసీసీ మ్యూజియంలో సచిన్ చిత్రపటం
సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. లార్డ్స్ మైదానంలోని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మ్యూజియంలో గురువారం అతడి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సచిన్ 18 ఏళ్ల క్రితం నాటి ఫొటోగ్రా్ఫను స్టువర్ట్ పియర్సన్ అనే చిత్రకారుడు చిత్రించాడు. ఈ చిత్రాన్ని ఏడాది చివరి వరకు ఎంసీసీ మ్యూజియంలోనే ఉంచి, ఆ తర్వాత లార్డ్స్ పెవిలియన్కు మార్చనున్నారు. భారత్ నుంచి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, కపిల్ దేవ్, బిషన్ సింగ్, వెంగ్సర్కార్ చిత్రాలు కూడా ఎంసీసీ మ్యూజియంలో ఉన్నాయి. మరోవైపు లార్డ్స్లో జరుగుతున్న తాజా టెస్టును సచిన్ గంట మోగించి ఆరంభించాడు.
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 02:23 AM