Sonali Ghosh: సవాళ్ళకు ఎదురు నిలిచి...
ABN, Publish Date - Oct 23 , 2025 | 03:10 AM
మాది మధ్యతరగతి బెంగాలీ కుటుంబం. నేను పుణేలో పుట్టాను. మా నాన్న ఉద్యోగం కారణంగా ఎక్కువ కాలం అటవీ ప్రాంతాల్లోనే నా బాల్యం గడిచింది.....
‘‘ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను స్వాగతించడం, కొత్తదారుల్లో పయనించడం...
వీటి వల్ల జీవితం ఉత్సాహభరితంగా సాగుతుంది’’ అని చెబుతారు సోనాలీ ఘోష్. పాతికేళ్ళ క్రితం...
మహిళలు చాలా అరుదుగా కనిపించే ఫారెస్ట్ సర్వీ్సలో అడుగుపెట్టిన ఆమె... కజిరంగా నేషనల్ పార్క్కు
తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా చరిత్రకెక్కారు.
అంతేకాదు... ఇటీవల మన దేశం తరఫున ప్రతిష్ఠాత్మకమైన ‘కెంటన్ మిల్లర్’ పురస్కారాన్ని అందుకున్న తొలి వ్యక్తిగా
ఘనత సాధించారు. ప్రకృతి అన్నా, సాహసాలన్నా తనకు ఎంతో ఇష్టమంటున్న సోనాలీ ప్రయాణం ఇది.
‘‘మాది మధ్యతరగతి బెంగాలీ కుటుంబం. నేను పుణేలో పుట్టాను. మా నాన్న ఉద్యోగం కారణంగా ఎక్కువ కాలం అటవీ ప్రాంతాల్లోనే నా బాల్యం గడిచింది. చెట్లు, నదులు, అడవులు, జంతువులు నా జీవితంలో భాగమైపోయాయి. కొత్త భాషలు, సంస్కృతులతో పరిచయం కలిగింది. ప్రశాంతమైన ప్రకృతి మధ్య గడపడం ఎంతో సంతోషంగా అనిపించేది. నా ఉద్యోగం కూడా దానికి సంబంధించినదే కావాలని కోరుకున్నాను. అటవీ, వన్యప్రాణుల శాస్త్రంలో పీజీ, ‘ఎన్విరాన్మెంటల్ లా’లో పీజీ డిప్లమా చేశాను.ఆ తరువాత డెహ్రాడూన్లోని ‘వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (డబ్ల్యూఐఐ)లో వైల్డ్ లైఫ్ మేనేజిమెంట్ కోర్స్ చేశాను. ‘మానస్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణ - రిమోట్ సెన్సింగ్ సాంకేతికత వినియోగం’పై నేను చేసిన పరిశోధనలకు డాక్టరేట్ లభించింది. 2000 సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీ్సలో చేరాను. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో సహాయ కన్జర్వేటర్గా వృత్తి జీవితంలో అడుగుపెట్టాను.
వారిలో ఉత్సాహం నింపుతూ...
వృత్తి జీవితంలో తొలిరోజుల్లోనే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్షాకాలంలో ముంచెత్తే వరదలు, వనరుల కొరత, వన్యప్రాణుల అక్రమ రవాణా, మానవుల స్వార్థం కారణంగా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం... కొందరు సిబ్బంది అలసత్వం వీటికి తోడవడంతో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. దాదాపు 430 కిలోమీటర్ల మేర వ్యాపించిన కజిరంగా నేషనల్ పార్క్... ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఆశ్రయం ఇస్తున్న ప్రాంతం. అక్రమ రవాణాదారులవల్ల వన్యప్రాణులతో పాటు పార్క్కు నలుదిక్కుల్లో కాపలాగా ఉండే సిబ్బంది ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. సిబ్బందిలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం మారుమూల గస్తీ శిబిరాలను తరచుగా సందర్శించేదాన్ని. ఇది వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ తరువాత ఢిల్లీ జూలాజికల్ పార్క్ డైరెక్టర్గా, సెంట్రల్ జూ అథారిటీ డీఐజీగా, ‘స్వచ్ఛభారత్ మిషన్’కు డైరెక్టర్గా, గువాహటి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్స్ట్సగా... ఇలా పలు హోదాల్లో పని చేశాను. రెండేళ్ళ క్రితం కజిరంగా నేషనల్ పార్క్కు ఫీల్డ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. సుమారు 120 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ పార్క్కు ఫీల్డ్ డైరెక్టర్ అయిన తొలి మహిళను నేనే.
అది గర్వకారణం...
కజిరంగా నేషనల్ పార్క్.. బ్రహ్మపుత్ర నదీతీరాన, వరదలు ముంచెత్తే ప్రాంతంలో ఉంది. అది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలతో పాటు ఏనుగులు, పులులు, లేళ్ళు, అయిదు వందలకు పైగా పక్షి జాతులకు నిలయం. వృక్ష వైవిధ్యమూ ఎక్కువ. సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫీల్డ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత... పార్కులో పరిరక్షణతో పాటు సందర్శకులను ఆకర్షించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దాదాపు పాతికేళ్ళ నుంచి నేను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా... ఈ ఏడాది ‘కెంటన్ మిల్లర్’ పురస్కారం నాకు లభించింది. ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణవేత్త డాక్టర్ కెంటన్ ఆర్.మిల్లర్ పేరిట ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయుసిఎన్) ఆ అవార్డును అందజేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో... పర్యావరణ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. అబుదాబీలో ఈనెల పదోతేదీన జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు నేను కూడా ఆ పురస్కారాన్ని అందుకున్నాను. దీన్ని మన దేశం నుంచి అందుకున్న తొలి వ్యక్తిని నేను కావడం గర్వంగా ఉంది. మరింత నిబద్ధతతో నా వృత్తి జీవితాన్ని కొనసాగించడానికి నాకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుంది.’’
ఈ వృత్తిని నేను ఎంచుకున్నప్పుడు ఎంతోమంది నిరుత్సాహపరిచేలా మాట్లాడారు. మహిళను కావడం వల్ల దీనిలో రాణించడం కష్టమన్నారు. అది కొంతవరకూ నిజమే. ఇంటి పనులను, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం ఇబ్బందే. గృహిణిగా, తల్లిగా నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే కుటుంబం సహకారంతో వాటిని అధిగమించగలిగాను. అంతేకాదు... అటవీ ప్రాంతాల్లో మహిళలకు సరైన సౌకర్యాలు ఉండవు. ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఐఎ్ఫఎస్ చేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం.’’
Updated Date - Oct 23 , 2025 | 03:10 AM