DIY Diwali Diyas: ప్రమిదలు తయారుచేద్దాం రండి
ABN, Publish Date - Oct 20 , 2025 | 05:45 AM
దీపావళి పండుగ వస్తుందనగానే మహిళలంతా ప్రమిదలమీదే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. పూజ కోసం మట్టి ప్రమిదలను, ఇంటి అలంకరణకు రకరకాల దివ్వెలను కొనుగోలు చేస్తుంటారు...
దీపావళి పండుగ వస్తుందనగానే మహిళలంతా ప్రమిదలమీదే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. పూజ కోసం మట్టి ప్రమిదలను, ఇంటి అలంకరణకు రకరకాల దివ్వెలను కొనుగోలు చేస్తుంటారు. ప్రమిదలను కొని తెచ్చుకునేకన్నా పిల్లలతో కలిసి స్వయంగా తయారు చేసుకుంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం! ఇంట్లోనే ప్రమిదలను తయారుచేద్దాం రండి..!
ఏం కావాలంటే...
గోధుమ పిండి- అర కప్పు, నీళ్లు- తగినన్ని, నూనె- పావు కప్పు, ఒత్తులు- మూడు, జిగురు- ఒక బాటిల్, పెయింటింగ్ బ్రష్, చిన్న అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, రంగులు- ఎరుపు, పసుపు, ఆకుపచ్చ
ఇలా తయారుచేయాలి...
వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని నీళ్లు చిలకరిస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. ఆపైన మూతపెట్టి పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండ మధ్యలో బొటనవేలితో నొక్కి చేత్తో ప్రమిద ఆకారం వచ్చేలా చేయాలి. ప్రమిదకు ఒక వైపున ఒత్తి వేయడానికి వీలుగా నొక్కు పెట్టాలి.
ఇలా తయారుచేసుకున్న ప్రమిదలను బేకింగ్ ట్రేలో అమర్చాలి. ఓవెన్ను 200 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయాలి. తరువాత అందులో ప్రమిదల ట్రే పెట్టి పావుగంటసేపు బేక్ చేసి బయటికి తీయాలి.
ప్రమిదలు పూర్తిగా చల్లారిన తరువాత వాటికి బ్రష్ సహాయంతో రంగులు వేసి ఆరబెట్టాలి.
ఎరుపు రంగు వేసిన ప్రమిదలపై తెల్లగా మెరిసే రాళ్లు, పసుపు రంగు పూసలు అంటించాలి. పసుపు రంగు వేసిన ప్రమిదలపై ఆకుపచ్చని రంగుతో పూల కొమ్మల డిజైన్ వేసి ఎర్రటి రాళ్లు అంటించాలి. ఆకుపచ్చ రంగు వేసిన ప్రమిదలపై పసుపు రంగుతో మామిడి పిందెల డిజైన్ వేసి తెల్లటి రాళ్లు అంటిస్తే బాగుంటుంది.
రంగు రంగుల ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించి ఇల్లంతా అలంకరిస్తే శోభాయమానంగా కనిపిస్తుంది.
Updated Date - Oct 20 , 2025 | 05:45 AM