పసికందులకు ఎలాంటి ఘనాహారం
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:50 AM
ఆరో నెల నుంచి సాధారణంగా అన్నంలో పప్పు, నెయ్యి కలిపి తినిపించడం మొదలు పెడతాం! కానీ వీటి ద్వారా బిడ్డకు అందే పోషకాలు అతి స్వల్పం. కాబట్టి....
కౌన్సెలింగ్
డాక్టర్! మా బాబుకు ఐదో నెల. ఆరో నెల నుంచి ఘనాహారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. బిడ్డకు ఏడాది వయసొచ్చేవరకూ ఎలాంటి ఆహారం అందించాలో వివరించగలరు?
- ఓ సోదరి, హైదరాబాద్
ఆరో నెల నుంచి సాధారణంగా అన్నంలో పప్పు, నెయ్యి కలిపి తినిపించడం మొదలు పెడతాం! కానీ వీటి ద్వారా బిడ్డకు అందే పోషకాలు అతి స్వల్పం. కాబట్టి....
జూ పప్పుధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు, పులుపు లేని పళ్లు తినిపించాలి. రుచి కోసం చాలా పరిమితంగా నెయ్యి వాడొచ్చు. లేదంటే ఏదైనా వెజిటబుల్ ఆయిల్ అయినా అన్నంలో కలిపి పెట్టొచ్చు.
జూ ఉప్పు, తీపి... ఈ రెండూ రుచిని పెంచే మాట నిజమే అయినా, పసికందులకు వీటిని అలవాటు చేయకూడదు. వీటికి బదులుగా రుచి కోసం పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడులను వంటకాల్లో కలిపి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
తీపి పెట్టాలనుకుంటే తగు మాత్రంగా బెల్లం వాడొచ్చు. నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే బెల్లం లేదా పళ్ల ముక్కలు వేసి తాగించవచ్చు.
తొమ్మిదో నెల నుంచి గుడ్డు పచ్చసొన తినిపించవచ్చు.
ఉడికించే ఆహారం మెత్తగా ఉండాలి.
ప్రతి పూటా అన్నమే తినిపించాలని లేదు. అన్నం బదులు కూరగాయ ముక్కలను తగుపాళ్లలో మసాలాలు జోడించి తినిపించవచ్చు. ఉడికించి, చిదిమిన పళ్ల ముక్కలు తినిపించవచ్చు.
పెద్దలతో సమానంగా పిల్లలూ మూడు పూటలు తినాలి అనుకుంటే పొరపాటు. ఒకేసారి ఎక్కువ పరిమాణాల్లో పిల్లలు తినలేకపోతే, అదే పరిమాణాన్ని 6 భాగాలుగా వేర్వేరు సమయాల్లో తినిపించవచ్చు.
సెరెలాక్ లాంటి ప్రత్యామ్నాయ మిల్క్ ఫుడ్స్, ప్రయాణాల్లో, ఇంటి భోజనం వండలేని సమయాల్లో మాత్రమే ఇవ్వాలి. దీన్లో చక్కెర కలపకూడదు.
ఇవి కూడదు...
పిల్లలకు తినిపించకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...
అలర్జీ తలెత్తకుండా ఉండడం కోసం కొత్తగా ఏ రెండు కొత్త పదార్థాలను కలిపి తినిపించకూడదు. ఒకదాని తర్వాత మరొకటిగానే రుచి అలవాటు చేయాలి.
ఈ వయసు పిల్లలకు నట్స్ నుంచి అలర్జీ లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి వేరుశనగ, బాదం, జీడిపప్పు లాంటివి పొడి రూపంలో కూడా తినిపించకూడదు.
సంవత్సరం లోపు పిల్లలకు తేనె, ఉప్పు, చక్కెర తినిపించకపోవడమే మంచిది. తీయదనం కోసం బెల్లం వాడొచ్చు.
బాస్మతి లాంటి పాలిష్ పట్టిన బియ్యం వాడకూడదు.
ఐస్క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు.
డాక్టర్ సుమతి,
పిడియాట్రిషియన్, హైదరాబాద్
Read latest AP News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 05:50 AM