Gujarat Women Entrepreneur: ఆ ఇబ్బంది తగ్గించేందుకు
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:58 AM
నెలసరి.. ఆడవారిలో ప్రతినెలా జరిగే ఒక సహజ ప్రక్రియ. ఆ సమయంలో మహిళలు మార్కెట్లో దొరుకుతున్న శానిటరీ ప్యాడ్ల వలన దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్యాడ్ల వలన...
నెలసరి.. ఆడవారిలో ప్రతినెలా జరిగే ఒక సహజ ప్రక్రియ. ఆ సమయంలో మహిళలు మార్కెట్లో దొరుకుతున్న శానిటరీ ప్యాడ్ల వలన దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్యాడ్ల వలన అందరి కంటే ఎక్కువ బాధను అనుభవించారు గుజరాత్కు చెందిన గీతా సోలంకి. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా వస్త్రంతో ప్యాడ్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం...
గీతా సోలంకి.. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరవల్ అనే తీరప్రాంత పట్టణంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆమె చిన్నతనం అంతా అక్కడే గడిచింది. ఆమెకు యుక్త వయసులో ఓ కణితి ఏర్పడడంతో కూర్చోడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఇక నెలసరి సమయంలో ఆమె బాధ మరింత ఎక్కువయ్యేది. మార్కెట్లోని ప్యాడ్ల వాడకం వలన దురద, చికాకుతో నరకం అనుభవించారు. తన బాధను తల్లితో పంచుకోగా, ఆమె మెత్తని వస్త్రం వాడమని చెప్పారు. అందుకు గీత మొదట ఒప్పుకోలేదు. ఇన్ఫెక్షన్ వస్తుందని తిరస్కరించింది. అమ్మ నచ్చ చెప్పడంతో చివరికి అంగీకరించింది. వాడిన తరువాత గీతకు ఎంతో ఉపశమనం కలిగింది.
ఆలోచన అలా వచ్చింది..
గీతది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో ఎక్కువ మంది ఉండేవారు. ఇంట్లోని ఆడవారు శానిటరీ ప్యాడ్ల వలన ఎదుర్కొంటున్న సమస్యలను, అనుభవాలను అప్పుడప్పుడు వారితో ఒకరు పంచుకునే వారు. అప్పుడే గీతకు, వస్త్రంతోనే ప్యాడ్లు ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ప్యాడ్ల తయారీపై లోతైౖన పరిశోధన చేసి, 2018లో యునిప్యాడ్స్ సంస్థను స్థాపించారు. మొదట్లో ప్యాడ్లు కుట్టేందుకు మనుషులు దొరకలేదు. కొందరు ఆడవారు రావాలనుకున్నా నెలసరి మీద అపోహలతో వారి కుటుంబాలు ఒప్పుకోలేదు. దాంతో ఎంతో ఆలోచించి ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నారు గీత. జీతం ఇచ్చి కుట్టు మిషన్ నేర్పిస్తామని చెప్పారు. దాంతో ఇంట్లోని వారు ఆడవారిని పంపడానికి ఒప్పుకున్నారు. అలా వచ్చిన వారు రోజులు గడిచేకొద్దీ నెలసరి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. తరువాత వారి అనుభవాలు పంచుకున్నారు. నెల రోజుల కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిపోయాక మరుసటి రోజు నుంచి తాము ప్యాడ్ల తయారీ మొదలుపెడుతున్నామని, ఆసక్తి ఉన్నవారు రావొచ్చని గీత చెప్పారు. మిషన్ నేర్చుకున్న 15 మందిలో 11 మంది ప్యాడ్లు కుట్టేందుకు వచ్చారు.
ఎన్నో అనుమానాలు..
చదువుకున్న వారిలోనూ వస్త్రంతో రూపొందించిన ప్యాడ్లపై ఎన్నో అనుమానాలు. అవి పరిశుభ్రం కాదనీ, పాత విధానమని ఎవరు వాడటానికి ముందుకు రాలేదని గీత గుర్తు చేసుకున్నారు. ‘‘దాంతో మొదట కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికి ఈ ప్యాడ్లు అందించాం. వారు ఉపయోగించి తరువాత వారే మా ప్యాడ్లు అమ్మడం మొదలుపెట్టారు. అలా ‘‘కళ్యాణి’’ వ్యవస్థ పుట్టింది. కళ్యాణిలు వారి గ్రామాల్లో మా ప్యాడ్లు అమ్ముతారు. అందుకు వారికి కమిషన్ లభిస్తుంది. అలాగే నెలసరి ఆరోగ్యం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం గుజరాత్ వ్యాప్తంగా దాదాపు 200 మంది కళ్యాణీలు పనిచేస్తున్నారు’’ అని గీత చెప్పారు.
పిల్లల హాజరు పెంచేందుకు..
కొంతమంది పిల్లలు నెలసరి సమయంలో బడికి వెళ్లరు. ఈ పద్ధతిని నిర్మూలించడం కోసం యూనిప్యాడ్స్ ‘స్కూల్ మైల్స్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమ్మాయిలకు కిట్(ఏడాదిన్నరపాటు వినియోగింవచుకునే క్లాత్ ప్యాడ్స్, వస్త్రంతో తయారుచేసిన స్కూల్ బ్యాగ్, లోదుస్తులు, సబ్బు, హాట్ వాటర్ బ్యాగ్)ను అందిస్తుంది. ఆ తరువాత ప్రతినెలా వారి హాజరును పరిశీలిస్తుంది. హాజరులో మెరుగుపడిన వారికి యూనిఫాం, స్టేషనరీ, కొత్త ప్యాడ్లు అందిస్తుంది. '
కేన్స్లో అవార్డు
నెలసరిలో ఉన్న ఆడవారిని వంటింట్లోకి రానివ్వకపోవడం మీద యూనిప్యాడ్స్ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించింది. అహ్మదాబాద్లోని ఓ పెద్ద రెస్టారెంట్లో నెలసరిలో ఉన్నవారితోనే వంట వండించింది. చాలామంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయోన్సర్లు, నాయకులు వాటిని తిని నిరసనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించగా అది కేన్స్ క్రియేటివిటీ ఫెస్టివల్లో ‘సిల్వర్ గ్లాస్ లయన్’ అవార్డు గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్తో గుండె జబ్బులన్నీ మాయం..
Updated Date - Jul 28 , 2025 | 03:58 AM