ధనురాసనం వేద్దామా
ABN, Publish Date - Jun 04 , 2025 | 06:40 AM
వేసవిలో ఎండ వేడివల్ల అలసటగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. వీటిని నివారించి ఉత్సాహంగా ఉండాలంటే... ప్రతిరోజూ యోగా చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యోగాలో ముఖ్యమైన భంగిమ ‘ధనురాసనం’. దీని గురించి తెలుసుకుందాం....
వేసవిలో ఎండ వేడివల్ల అలసటగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. వీటిని నివారించి ఉత్సాహంగా ఉండాలంటే... ప్రతిరోజూ యోగా చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యోగాలో ముఖ్యమైన భంగిమ ‘ధనురాసనం’. దీని గురించి తెలుసుకుందాం.
ధనురాసనం ఇలా వేయాలి
ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. మోకాళ్ల నుంచి కాళ్లను పైకి ఎత్తాలి. చేతులను వెనక్కి చాచి కాలి మడమలను పట్టుకోవాలి. మెడను నిటారుగా ఉంచాలి. గుండె నిండా గాలిని పీల్చి పదిహేను సెకండ్లు అలాగే ఉండి తరవాత గాలిని మెల్లగా విడవాలి.
ప్రయోజనాలు
ప్రతిరోజూ ధనురాసనం వేయడం వల్ల కండరాలు, కీళ్లు బలోపేతమవుతాయి. శరీరం అన్ని వైపులకూ సులువుగా వంగుతుంది.
ఈ ఆసనం వేసేటప్పుడు పొత్తి కడుపు కండరాల మీద ఒత్తిడి పడడం వల్ల అవి దృఢంగా తయారవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణాశయం చురుకుగా పనిచేసి అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
వెనక్కి వంగడం వల్ల వెన్నెముక బలపడుతుంది. నడుము వంగకుండా ఉంటుంది. నిటారుగా నిలబడి నడిచే సామర్థ్యం పెరుగుతుంది.
తరచూ ఈ ఆసనం వేస్తూ ఉంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీంతో అలసట, నీరసం, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ధనురాసనం వేసే క్రమంలో రెండు కాళ్లు పైకి లేపడం వల్ల శరీరమంతటా రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. దీంతో గుండె, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
కార్యాలయాల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తూ ఉంటే భుజాలు, మెడ, తల నొప్పులు సహా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
దీర్ఘంగా శ్వాస పీల్చడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 04 , 2025 | 06:40 AM