Global Religion Statistics: ప్రపంచంలో పెద్ద మతం క్రైస్తవం
ABN, Publish Date - Jun 11 , 2025 | 07:50 AM
ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే.. మరోవైపు తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ..
వేగంగా పెరుగుతున్న ఇస్లాం
మతం లేదన్న వారి సంఖ్యా గణనీయం
స్థిరంగా హిందూ మతం: ప్యూ రిసెర్చ్ సర్వే
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే.. మరోవైపు తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ, మతం వద్దనుకొనే వారి సంఖ్య కూడా దాంట్లోనే అధికంగా ఉంది. అందువల్ల శాతాల్లో లెక్కిస్తే క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్యభాగం నాటికి క్రైస్తవంతో సమానం కానుంది. హిందువుల జనాభా స్థిరంగా ఉండగా, బౌద్ధుల సంఖ్య పడిపోతోంది. ప్యూ రీసెర్చి సెంటర్ జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2010-2020 కాలానికి చెందిన 2,700 జనాభా లెక్కలు, సర్వేలను అధ్యయనం చేసిన ప్యూ సెంటర్ మతాల వారీగా జనాభా పెరుగుదలలో మార్పులను గుర్తించింది. ఈ పదేళ్ల కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. 2010లో 30.6 శాతం ఉండగా, అది 28.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా 34.70 కోట్ల మేర అధికమయింది. మొత్తం జనాభా సుమారు 200 కోట్ల వరకు ఉంది. 1.8 పాయింట్ల వృద్ధి శాతంతో ప్రపంచ జనాభాలో 25.6 శాతం వాటా పొందింది. ఏ మతమూ లేదని చెప్పే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2 శాతం వరకు ఉంది. హిందూమతం, జూడాయిజం జనాభా స్థిరంగా ఉంది. గత పదేళ్లలో బౌద్ధుల జనాభా తగ్గింది. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్ల్లో అధికంగా ఉంది. లౌకికవాద భావజాలం పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా సమాజం, పరిపాలనలో మార్పులు వస్తాయని ఈ అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడ్డారు.
Updated Date - Jun 11 , 2025 | 07:52 AM