US Advisory: జమ్మూ, కశ్మీర్ వెళ్లొద్దు.. అమెరికా పౌరులకు ఆ దేశ సూచన
ABN, Publish Date - Apr 24 , 2025 | 04:15 PM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. జమ్ము కశ్మీర్ రాజధాని లేహ్, తూర్పు లడఖ్ ప్రాంతం సురక్షిత ప్రాంతాలని అభిప్రాయపడ్డ అమెరికా..
US issues Do Not Travel advisory: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత అమెరికా.. ఆదేశ పౌరులకు జమ్మూ, కశ్మీర్ వెళ్లొద్దంటూ సలహా ఇచ్చింది. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని పేర్కొంది. అయితే, తూర్పు లడఖ్ ప్రాంతం, రాజధాని లేహ్ సందర్శనలకు మినహాయింపునిచ్చింది.
శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి పర్యాటక ప్రదేశాలలో అప్పుడప్పుడు హింస జరుగుతుందని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. "భారత ప్రభుత్వం LOC వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి విదేశీ పర్యాటకులను అనుమతించదు. అమెరికా ప్రభుత్వ సిబ్బంది జమ్మూ కశ్మీర్కు ప్రయాణించడం నిషేధించబడింది" అని పేర్కొంది. సాయుధ ఘర్షణకు అవకాశం ఉన్నందున భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకుండా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది.
పహల్గాంలో ఉగ్రవాదులు 24 మంది పర్యాటకులతో సహా మొత్తం 26 మందిని చంపిన ఒక రోజు తర్వాత, అమెరికా రాయబార కార్యాలయం ఈ సలహా జారీ చేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా దీనిని పరిగణిస్తున్న భారతప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటామని.. దోషులను వదిలిపెట్టబోమని తెలిపింది.
కాగా, జమ్మూ, పర్యాటకుల సౌకర్యార్థం కశ్మీర్ పర్యాటక శాఖ బుధవారం టిక్కెట్ల రద్దు ఛార్జీలను మినహాయించడంతో సహా ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి మద్దతు అందించాలని అన్ని పర్యాటక సేవా కేంద్రాలకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు, పహల్గాం ఉగ్రవాద దాడి పర్యాటకుల రాకపోకలను దెబ్బతీస్తుందని కాశ్మీర్లోని టూర్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..
ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..
For More AP News and Telugu News
Updated Date - Apr 24 , 2025 | 04:22 PM