India GDP: స్థిరంగా అడుగులు
ABN, Publish Date - May 26 , 2025 | 02:38 AM
భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ముందుకెళ్తోంది ఇప్పటికే 4.18 ట్రిలియన్ డాలర్లతో 4వ స్థానాన్ని అధిగమించి జర్మనీని వెనక్కి నెట్టేందుకు సిద్ధమవుతోంది. కానీ తలసరి ఆదాయం పరంగా భారత్కు టాప్ దేశాలతో భారీ తేడా కొనసాగుతోంది.
త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం
గత ఐదేళ్లలో కరోనాను తట్టుకొని వృద్ధి
ఒడిదుడుకుల్లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ
టాప్-3లో అమెరికా, చైనా, జర్మనీ
(సెంట్రల్డెస్క్)
2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల (రూ.4,25,86,000 కోట్లు) ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని భారత్ 2018లోనే లక్ష్యాన్ని రూపొందించుకుంది. ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వ విభాగాలు మాత్రమేగాక వివిధ పరిశ్రమ రంగాల నుంచి నిపుణులతో ఒక కోర్ గ్రూప్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, మధ్యలో ముంచుకొచ్చిన కరోనాతో ఈ అంచనాలు తలకిందులయ్యాయి. యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా స్తంభించిపోయింది. భారత్పైనా తీవ్ర ప్రభావం పడింది. అంత పెద్ద ఉత్పాతం సంభవించినప్పటికీ.. స్థిరంగా అడుగులు వేస్తూ 4.187 ట్రిలియన్ డాలర్లకు (రూ.3,56,61,000 కోట్లు) చేరుకున్నాం.. జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచాం. మన కన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీ ఉన్నాయి. త్వరలోనే జర్మనీని అధిగమించి మూడో స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థను గమనిస్తే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఆ దేశం ఒడిదొడుకులకు లోనైన విషయం స్పష్టమవుతోంది. 2019లో ఆ దేశం వృద్ధి రేటు 0.99% కాగా.. 2020లో మైనస్ 4.1% నమోదైంది (కరోనా కారణంగా). మరుసటి ఏడాది (2021లో) పుంజుకొని 3.67ు వృద్ధిరేటును నమోదు చేసినప్పటికీ.. మళ్లీ ఏడాదిలోనే (2022లో) 1.37 శాతానికి పడిపోయింది.
అదే క్రమంలో 2023లో మైనస్ 0.26ు నమోదు చేసింది. 2024లో ఇది మైనస్ 0.4 శాతానికి వృద్ధిరేటు పడిపోయింది. ఇదే కాలవ్యవధిలో భారత్ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ పనితీరును చూపింది. కరోనా కారణంగా 2019-20లో వృద్ధిరేటు మైనస్ 5.78 శాతానికి పడిపోయింది. 2020-21లో పుంజుకొని ఏకంగా 9.68ు వృద్ధిరేటును నమోదు చేసింది. 2021-22లో 6.99ు, 2022-23లో 7ు, 2023-24లో 7.61ు నమోదైంది. మొత్తంగా భారత్ స్థిరంగా అడుగులు వేస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన మరో రెండున్నర లేదా మూడేళ్లలో జర్మనీని దాటి ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం చేసిన ప్రకటన వాస్తవాలకు దగ్గరగానే ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, తలసరి ఆదాయం పరంగా ఆయా దేశాలతో భారత్కు అంతరం భవిష్యత్తులో చాలా ఏళ్లపాటు కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, ప్రస్తుతం భారత్.. జపాన్ను అధిగమించి 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ.. తలసరి ఆదాయంలో జపాన్కు భారత్కు మధ్య తీవ్రమైన అంతరం ఉంది. జపాన్ తలసరి ఆదాయం 33,960 డాలర్లు(రూ.28,92,413) కాగా, భారత్ తలసరి ఆదాయం 2,880 డాలర్లు (రూ.2,45,293)మాత్రమే.
టాప్ 3 దేశాల పరిస్థితి..
టాప్-3 దేశాలుగా ఉన్న అమెరికా, చైనా, జర్మనీల జీడీపీలు, తలసరి ఆదాయాలు ఇలా ఉన్నాయి.. అమెరికా జీడీపీ 30.51 ట్రిలియన్ డాలర్లు, తలసరి ఆదాయం 89,110 డాలర్లు. చైనా జీడీపీ 19.23 ట్రిలియన్ డాలర్లు, తలసరి ఆదాయం 13,690 డాలర్లు. జర్మనీ జీడీపీ 4.74 ట్రిలియన్ డాలర్లు, తలసరి ఆదాయం 55,910 డాలర్లు. చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ.. తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఉన్న జర్మనీ కన్నా వెనుకబడి ఉండటానికి కారణం.. జనాభానే. జర్మనీ జనాభా 8.3 కోట్లు కాగా, చైనా జనాభా 141 కోట్లు. భారత్, జపాన్ విషయంలో అంతరానికీ ఇదే వర్తిస్తుంది. జపాన్ జనాభా 12.45 కోట్లు కాగా.. భారత్ జనాభా 144 కోట్లను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం కావటం గమనార్హం. ఇక, ఆర్థికరంగంలో చైనా వేగంగా ముందుకెళ్తోంది. వృద్ధిరేటు పరంగా అమెరికా కంటే వేగంగా దూసుకెళ్తోంది. 2021లో 8ు వృద్ధిరేటును నమోదు చేస్తే.. ఆ ఏడాది అమెరికా 6 శాతానికి పరిమితమైంది. 2023లో చైనా 5.4ు నమోదు చేస్తే.. అమెరికా వృద్ధి రేటు 2.89ు. ఈ లెక్కన కొన్నేళ్లలోనే అమెరికాను అధిగమించి చైనా నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్పై ట్రాన్స్జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 02:38 AM