PM Modi: మేకిన్ ఇండియా అస్త్రాల సత్తా చాటాం
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:00 AM
మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన ఆయుధాలతో శత్రువులను మట్టి కరిపించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
ఆపరేషన్ సిందూర్లో శత్రువులను మట్టికరిపించాం
స్వదేశీ ఆయుధాల బలాన్ని ప్రపంచానికి చూపాం
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకం
మన దేశంపై పెరుగుతున్న నమ్మకానికి సూచిక
కాశీ-తమిళ సంగమంతో సాంస్కృతిక వారసత్వం బలోపేతం
ఆత్మవిశ్వాసంతో వికసిత్ భారత్ నిర్మిస్తున్నాం
తమిళనాడులోని తూత్తుకుడిలో ప్రధాని మోదీ
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
చెన్నై, జూలై 26(ఆంధ్రజ్యోతి): మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన ఆయుధాలతో శత్రువులను మట్టి కరిపించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వదేశీ ఆయుధాల బలమేంటో ప్రపంచానికి చాటామన్నారు. శనివారం రాత్రి 8 గంటలకు మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా తమిళనాడులోని తూత్తుకుడికి ప్రధాని వచ్చారు. రూ. 4,900 కోట్ల వ్యయంతో చేపట్టిన తూత్తుకుడి విమానాశ్రయ నూతన టెర్మినల్ నిర్మాణం, వీవోసీ పోర్ట్ ఉత్తర కార్గో బెర్త్-3 నిర్మాణం ప్రారంభించారు. అలాగే పలు రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు. కూడన్కుళం అణువిద్యుత్ కేంద్రం 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్ తరలింపు కోసం ఐఎస్టీఎస్ కింద ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివ్సను పురస్కరించుకుని అమరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సింధూర్లో మేకిన్ ఇండియా ఆయుధాలు ఎంతో ప్రభావం చూపాయి. కీలక పాత్ర పోషించాయి. వాటితోనే తీవ్రవాదులను మట్టిలో కలిపేశాం. దేశంలో తయారయ్యే ఆయుధాలు ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాలుగు రోజుల విదేశీయానం తరువాత నేరుగా రామేశ్వరం వంటి పవిత్ర భూమికిపైకి వచ్చే అదృష్టం నాకు కలిగింది. భగవాన్ శ్రీరాముడు, తిరుచ్చెందూర్ మురుగన్ల ఆశీర్వాదంతో తమిళనాట కొత్త అధ్యాయం లిఖితమవుతోంది. 2014లో తమిళనాడు అభివృద్ధిలో పరుగులు పెట్టే ప్రణాళికలు రచించాం. వాటి ఫలితమే ఇప్పుడు తూత్తుకుడి విమానాశ్రయం, పోర్టు విస్తరణ వంటివి జరుగుతున్నాయని చెప్పారు.
నా విదేశీ పర్యటనలో చరిత్రాత్మక భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. ఇది దేశంపై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని, దేశ నూతన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ ఆత్మవిశ్వాసంతో వికసిత భారత్ను నిర్మిస్తున్నాం. మహాకవి సుబ్రమణ్య భారతీయార్ కూడా తూత్తుకుడి గడ్డపై జన్మించారు. ఆయనకు తూత్తుకుడితో పాటు నా నియోజకవర్గం కాశీతో కూడా గాఢానుబంధముంది. అందుకే కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం బలోపేతం చేసుకుంటున్నాం. పారిశ్రామిక వృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్కు రైల్వే జీవనాడి. గత 11 ఏళ్లలో దాని ఆధునీకరణపై దృష్టి సారించాం. నేడు దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గట్టి కృషి జరుగుతోంది. ఇటీవల ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ వంతెనతో జమ్మూ-శ్రీనగర్ను అనుసంధానించాం. అటల్ సేతు, బోగిబీల్ వంతెన, సోన్మార్గ్ సొరంగం వంటివి ఎన్నో ప్రాజెక్టులను మా ప్రభుత్వం పూర్తి చేసింది. తద్వారా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించాం’’ అని పేర్కొన్నారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సభకు హాజరైన ప్రధాని.. తమిళంలో ప్రసంగాన్ని ప్రారంభించి, తమిళంలోనే ముగించడం విశేషం.
Updated Date - Jul 27 , 2025 | 04:02 AM