ఫంగ్సతో వ్యవసాయ ఉగ్రవాదం!?’
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:50 AM
అదో ప్రమాదకర ఫంగస్.. బయటికి వ్యాపించిందంటే వేలు, లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం.. దీనితో దిగుబడి, నాణ్యత తగ్గడమేకాదు.. ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకూ ప్రమాదం..
ప్రమాదకర ఫంగ్సను స్మగుల్ చేస్తున్న ఇద్దరు చైనా పరిశోధకులను అరెస్టు చేసిన అమెరికా
‘ఫుసేరియం గ్రామినియరం’గా పిలిచే ఈ ఫంగ్సతో గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ పంటలకు తీవ్ర నష్టం
న్యూఢిల్లీ, జూన్ 4: అదో ప్రమాదకర ఫంగస్.. బయటికి వ్యాపించిందంటే వేలు, లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం.. దీనితో దిగుబడి, నాణ్యత తగ్గడమేకాదు.. ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకూ ప్రమాదం.. మనలో కాలేయం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కూడా.. ఇలాంటి విషపూరిత ఫంగ్సను అమెరికాలోకి అక్రమంగా తీసుకెళ్తూ ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి పట్టుబడ్డారు. ‘ఫుసేరియం గ్రామినియరం’గా పిలిచే ఈ ఫంగస్ ‘వ్యవసాయ ఉగ్రవాదం (ఆగ్రో టెర్రరిజం)’ కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందంటూ ఎఫ్బీఐ కేసు నమోదు చేసింది. ఇది దేశ భద్రతకు ముప్పు అని పేర్కొంది. దీంతో ఈ ఫంగస్, వ్యవసాయ ఉగ్రవాదం అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మిషిగన్ వర్సిటీ ల్యాబ్కు తీసుకెళ్తున్నామని..
చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జున్యోంగ్ ల్యూ (34)తోపాటు ఆయన ప్రియురాలు, అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న యున్కింగ్ జియాన్ (33) కలసి అమెరికాలోకి ‘ఫుసేరియం గ్రామినియరం’ ఫంగ్సను అక్రమంగా తీసుకొస్తుండగా అమెరికా అధికారులు పట్టుకున్నారు. యున్కింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా భావిస్తున్నారు. మిషిగన్ యూనివర్సిటీలోని ల్యాబ్లో పరిశోధనల కోసం తాము ఈ ఫంగ్సను తీసుకొచ్చినట్టు వారు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చైనీయుల తీరు వ్యవసాయ ఉగ్రవాదంలో భాగమని.. అమెరికాలో పంటలను దెబ్బతీసే కుట్ర ఉందని అమెరికా అధికారులు వారిని అరెస్టు చేశారు.
‘ఫుసేరియం’తో ఏమిటీ ప్రమాదం?
‘ఫుసేరియం గ్రామినియరం’ ఒక రకం ఫంగస్. ఇది గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ వంటి పంటల్లో ‘హెడ్ బ్లైట్ లేదా స్కాబ్’గా పిలిచే తెగులుకు కారణం అవుతుంది. ఇది సోకిన పంటల దిగుబడి, నాణ్యత దారుణంగా తగ్గిపోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాదు ఈ ఫంగస్ ‘డీఆక్సీనివలెనాల్, జియారలెనోన్’గా పిలిచే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ విష పదార్థాలు పంటల ధాన్యాల్లో చేరుతాయి. ఆ ధాన్యాలను మనం ఆహారంగా తీసుకుంటే.. కాలేయం దెబ్బతింటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. వాంతులు, విరేచనాల వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఈ కారణాలతోనే ‘ఫుసేరియం.. గ్రామినియరం’ ఫంగ్సను వ్యవసాయానికి, ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తారు.
వ్యవసాయ ఉగ్రవాదమంటే?
ఆయుధాలతో విచ్చలవిడిగా దాడులు చేసి... పౌరులను, భద్రతా బలగాలను చంపే ఉగ్రవాదం అందరికీ తెలిసిందే. అలా నేరుగా కాకుండా లక్ష్యంగా చేసుకున్న దేశంలోకి ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు (పాథోజెన్స్), కీటకాలు వంటివాటిని ప్రయోగించి పాడిపంటలను తీవ్రంగా నష్టపర్చడం, తద్వార ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొనేలా చేయడం, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడమే ‘వ్యవసాయ ఉగ్రవాదం’గా చెప్పవచ్చు. పంటల్లో చాలా భాగం దెబ్బతినడంతో వందలు, వేల కోట్ల రూపాయల్లో నష్టం సంభవిస్తుంది. ప్రమాదకర పాథోజెన్స్ను ఏదైనా ఒక ప్రాంతంలో ప్రయోగిస్తే చాలు.. అవి చాలా దూరం వరకు విస్తరించి, తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు అవకాశాలు ఎక్కువని, దీనికి ఖర్చు కూడా తక్కువని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 07:15 AM