యాక్సియం-4 మిషన్.. మళ్లీ వాయిదా
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:29 AM
భారత వ్యోమగామి శుభాన్షుశుక్లా సహా నలుగురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు చేపట్టిన యాక్సియం-4 మిషన్ మరోసారి వాయిదా పడింది.
న్యూఢిల్లీ, జూన్ 11: భారత వ్యోమగామి శుభాన్షుశుక్లా సహా నలుగురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు చేపట్టిన యాక్సియం-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ను కక్ష్యలో ప్రవేశపెట్టాల్సిన ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఇంధన (లిక్విడ్ ఆక్సిజన్) లీకేజీ కారణంగా వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు స్పేస్ఎక్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరమ్మత్తులు పూర్తయ్యాక కొత్త లాంచ్ డేట్ను ప్రకటిస్తామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
కాగా.. ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ప్యాడ్పై ఉండగా నిర్వహించిన ఏడు సెకన్ల హాట్ టెస్ట్ సందర్భంగా.. రాకెట్లోని ‘ప్రొపల్షన్ బే’లో ద్రవ ఇందన లీకేజీని గుర్తించినట్టు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. నిజానికి ఈ మిషన్ను మే 29న చేపట్టాలని యాక్సియం సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ.. దాన్ని జూన్ 9కి, ఆ తర్వాత జూన్ 10కి.. జూన్ 11కి.. ఇలా మూడుసార్లు వాయిదా వేశారు. అయితే.. ఈసారి మాత్రం మిషన్ కొన్నిరోజులపాటు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Updated Date - Jun 12 , 2025 | 05:29 AM