US President Donald Trump: శ్వేత సౌధం.. స్వర్ణమయం!
ABN, Publish Date - Sep 30 , 2025 | 04:06 AM
అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేత సౌధాన్నివైట్ హౌస్ 24 క్యారెట్ల మేలిమి బంగారంతో అలంకరించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు...
ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూంలకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం
ప్రపంచ నేతలు విస్తుబోతారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఈ ఆడంబరం ఎందుకు: అమెరికన్లు
వాషింగ్టన్, సెప్టెంబరు 29: అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేత సౌధాన్ని(వైట్ హౌస్) 24 క్యారెట్ల మేలిమి బంగారంతో అలంకరించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఓవెల్ ఆఫీసు, క్యాబినెట్ రూంలకు బంగారు తాపడం పనులు జరిగినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ పోస్ట్’లో పంచుకున్నారు. ఈ బంగారు అలంకరణలు చూసి ప్రపంచ దేశాల నేతలు విస్తుబోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ‘‘శ్వేత సౌధంలోని ఓవల్ ఆఫీసు, క్యాబినెట్ రూమ్లకు అత్యంత నాణ్యమైన 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వీడియోలో అలంకరణకు సిద్ధంగా ఉన్న బంగారు గోడల ఆకృతులు కనిపించాయి. ‘‘మిరిమిట్లు గొలిపే అందాలను చూసి.. ప్రపంచ దేశాల నేతలే కాదు.. ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. విస్తుబోతారు. ఇప్పటి వరకు అత్యుత్తమ అందాన్ని, విజయాన్ని సొంతం చేసుకున్నది ఓవల్ ఆఫీస్ ఒక్కటే!.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆడంబరం ఎందుకని చాలా మంది విమర్శించారు. కాగా, ఈ బంగారు తాపడాలకు అయ్యే ఖర్చును ట్రంప్ సొంత నిధుల నుంచి వెచ్చిస్తున్నట్టు వైట్హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు.
Updated Date - Sep 30 , 2025 | 04:07 AM