Trade Growth: ఐదేళ్లలో భారత్-రష్యా వాణిజ్యం
ABN, Publish Date - Aug 22 , 2025 | 06:48 AM
అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్-రష్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. రానున్న ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రూ.8.72 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు పెంచాలని నిర్ణయించాయి.
రూ.8.72 లక్షల కోట్లకు పెంపు
ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాల నిర్ణయం
మాస్కో, ఆగస్టు 21: అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్-రష్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. రానున్న ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రూ.8.72 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు పెంచాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య విలువతో పోలిస్తే.. ఇది 50ు ఎక్కువ అని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్కు రష్యా 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. రష్యాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. బ్రిక్స్ దేశాలపై అమెరికా సుంకాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో మూడ్రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే..! ఈ సందర్భంగా మాస్కోలో జరిగిన ‘భారత్-రష్యా బిజినెస్ ఫోరం’లో, గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్లతో వేర్వేరుగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాల సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. ప్రస్తుతం సంక్లిష్టంగా మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ‘పరస్పరం ఆధారపడిన సుస్థిర భాగస్వాముల’ అవసరం ఏర్పడిందన్నారు. అమెరికాను.. ట్రంప్ సుంకాలను నేరుగా ప్రస్తావించకుండా.. ‘‘ఈ పరిస్థితులను అధిగమించేందుకు మన(బ్రిక్స్ దేశాల) నాయకులు నిత్యం చర్చలు జరపాలి. మన మధ్య సుంకాల భారం తగ్గాలి’’ అని అభిప్రాయపడ్డారు.
Updated Date - Aug 22 , 2025 | 07:01 AM