Military Security: పాక్లోకి చైనా సైనిక సంస్థలు!
ABN, Publish Date - Mar 19 , 2025 | 04:16 AM
పాకిస్థాన్లో పని చేస్తున్న చైనా వారిపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. వారి రక్షణకు చైనా రంగంలోకి దిగింది.
బీఎల్ఏ దాడుల నేపథ్యంలో నిర్ణయం
సీపెక్లో భాగంగా పాక్లో పని
చేస్తున్న వేలాది మంది చైనీయులు
వారిపై విరుచుకుపడుతున్న బీఎల్ఏ
సిబ్బంది రక్షణకు 3 ప్రైవేటు సెక్యూరిటీ,
మిలిటరీ ఏజెన్సీలతో చైనా ఒప్పందం
భవిష్యత్తులో సైన్యాన్నీ దించే చాన్స్
ఇస్లామాబాద్, మార్చి 18: పాకిస్థాన్లో పని చేస్తున్న చైనా వారిపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. వారి రక్షణకు చైనా రంగంలోకి దిగింది. 3 ప్రైవేటు మిలిటరీ, సెక్యూరిటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. డేవ్ సెక్యూరిటీ ఫ్రాంటియర్ సర్వీస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, హుయాగ్జిన్ జోంగ్షన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు ఇక మీదట పాక్లో చైనా జాతీయుల రక్షణ బాధ్యతలు చూసుకోనున్నాయి. వేల కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ‘చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్’ (సీపెక్)లో పలువురు చైనా జాతీయులు పని చేస్తున్నారు. కాగా, పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుతూ సాయుధ పోరాటం జరుపుతున్న బీఎల్ఏ.. చైనా-పాక్ కారిడార్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బలూచిస్థాన్లోని ఖనిజ సంపదను దోచుకోనున్నారన్నది ఆ సంస్థ ఆరోపణ. ఈ నేపథ్యంలో చైనీయుల మీద దాడులు జరిపి వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
తాజాగా బీఎల్ఏ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి, పలువురు పాక్ సైనికులను హతమార్చింది. సైన్యం కాన్వాయ్ మీద దాడి చేసి 90 మంది జవాన్లను ఊచకోత కోసింది. ఈ వరుస ఘటనలతో చైనీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చైనా ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి తమ వారి రక్షణ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. చైనా ఒత్తిడి మేరకు పాకిస్థాన్ తన రక్షణ బడ్జెట్లో.. చైనా జాతీయుల భద్రత కోసం భారీగా కేటాయింపులను పెంచింది. అయినప్పటికీ, చైనా పాక్ను నమ్మకండా తానే స్వయంగా రంగంలోకి దిగటం గమనార్హం. కాగా బలూచ్ తిరుగుబాటు దారులు మరిన్ని దాడులు జరిపే ప్రమాదం ఉన్న దృష్ట్యా 2,500 మందికి పైగా సైనికులు పాక్ ఆర్మీకి రాజీనామా చేశారన్న వార్త మరోవైపు పెను సంచలనం సృష్టిస్తోంది.
Updated Date - Mar 19 , 2025 | 04:16 AM