Toxic Liquor:పెరుగుతున్న కల్తీ సారా మృతులు
ABN, Publish Date - Aug 19 , 2025 | 05:28 AM
కువైత్లో కల్తీ సారా తాగి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదపు 30 మంది మరణించారు.
ఇప్పటివరకు 30 మంది కన్నుమూత
వీరిలో ఏడుగురు ప్రవాసాంధ్రులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): కువైత్లో కల్తీ సారా తాగి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదపు 30 మంది మరణించారు. వీరిలో ఏడుగురు ఏపీకి చెందిన వారని అధికారులు తెలిపారు. నలుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారు ఉన్నారని సమాచారం. మరో వైపు కల్తీ సారా ఘటనలో 40 మంది భారతీయులతో పాటు 160 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరికి కంటి చూపు శాశ్వతంగా పోయిందని, మరికొందరికి కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కల్తీ సారా కారకులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్కు చెందిన దెలోరా ప్రకాశ్ అనే ప్రవాసీయుడు సారా విక్రయిస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతనితో పాటు, ఆయన నేతృత్వంలో పనిచేసే భారత్, నేపాల్ దేశాలకు చెందిన 67 మందిని అరెస్టు చేశారు. కల్తీ సారా ఉత్పత్తి చేస్తున్న 10 కేంద్రాలను మూసివేశారు. దేశవ్యాప్తంగా తనఖీలను ముమ్మరం చేశారు. వీసా, ఉపాధి నిబంధనలను ఉల్లంఘించి ఉంటున్న భారతీయులు సహా విదేశీయులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా 258 మంది విదేశీయులను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
Updated Date - Aug 19 , 2025 | 05:28 AM