JNTU: ఎప్సెట్ బాధ్యతలు మరోసారి జేఎన్టీయూకే..
ABN, Publish Date - Jan 18 , 2025 | 01:21 PM
గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఎంసెట్/ఎప్సెట్ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ(JNTU)కే మరోసారి బాధ్యతలు అప్పగించారు.ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది జేఎన్టీయూనే.
- సమర్థవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్న వర్సిటీ
- గత 39 ఏళ్లలో 29 సార్లు నిర్వహణ
- ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈ ఏడాది ఎప్సెట్
హైదరాబాద్ సిటీ: గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఎంసెట్/ఎప్సెట్ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ(JNTU)కే మరోసారి బాధ్యతలు అప్పగించారు.ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది జేఎన్టీయూనే. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకై ప్రతిఏటా నిర్వహించే ఈ పరీక్షలను 2024 నుంచి ఎప్సెట్గా మార్చారు. మెడికల్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 1986 నుంచి ఎంసెట్ నిర్వహణను తొలి పదేళ్లలో కొన్ని యూనివర్సిటీలు నిర్వహించగా.. గత 39ఏళ్లలో 29సార్లు ప్రవేశపరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్టీయూకే అప్పగించడం విశేషం.
ఈ వార్తను కూడా చదవండి: Gunfire Case: హైదరాబాద్ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు
అలాగే, వరుసగా 26వ సారి ఎప్సెట్-2025ను జేఎన్టీయూనే నిర్వహించేందుకు సన్నద్ధమైంది. తాజాగా ఉన్నత విద్యామండలి వివిధ ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించడంతో ఏప్రిల్ 29నుంచి మే 5వరకు పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు సమాయత్తమయ్యారు. 1986 నుంచి 2017 వరకు ఎంసెట్ను మాన్యువల్గా నిర్వహించేవారు. ఈ విధానంలో నిర్వాహకులు ఎంతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేది. ప్రత్యేకించి ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, ఓఎంఆర్ ఆన్సర్షీట్లను తెప్పించుకోవడం వంటి అంశాల్లో అత్యంత భద్రత, గోప్యతను పాటించాల్సి వచ్చేది. ఈ క్రమంలో 2016లో ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రశ్నపత్రం లీక్ కావడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
2018 నుంచి ఆన్లైన్లోనే..
పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2017లో ఇంజనీరింగ్ సెట్(ఈసెట్)ను ఆన్లైన్లో ప్రయోగాత్మకంగా నిర్వహించి సక్సెస్ కావడంతో 2018 నుంచి అదే విధానాన్ని ఎంసెట్కు వర్తింపజేశారు. గతంలో పరీక్ష తర్వాత ఫలితాలు రావడానికి సుమారు రెండు నెలల సమయం పట్టేది. అయితే ఆన్లైన్ విధానంతో చివరి పరీక్ష పూర్తయిన వారం రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం అభ్యర్థులకు, తల్లిదండ్రులకు సంతృప్తిని కలిగించింది. గత రెండేళ్లు మరో అడుగు ముందుకేసి అభ్యర్థులు తమ జవాబు పత్రాన్ని నేరుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పారదర్శకతకు మరింత పెద్దపీట వేసినట్లైంది.
మరింత సాంకేతికతను జోడిస్తే మేలు..
ఎంసెట్/ఎఫ్సెట్ ప్రక్రియకు ఎప్పటికప్పుడు సాంకేతికతను జోడించిన జేఎన్టీయూ అధికారులు ప్రవేశపరీక్షల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. దీంతో లాసెట్, పీజీసెట్, పీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న ఇతర విశ్వవిద్యాలయాలు ఎప్సెట్ నిర్వహణకు జేఎన్టీయూ అనుసరిస్తున్న విధానాలనే అనుసరిస్తున్నాయి. అయితే, ఎప్సెట్ నిర్వహణలో అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా మరింత సాంకేతికతను జోడించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు సమీప పట్టణాల్లోని ఈసేవ/మీసేవా కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఇంటర్నెట్ ఉన్న ప్రతి మొబైల్ ఫోన్ నుంచి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఆన్లైన్ ప్రవేశ పరీక్షల నిర్వహణ పట్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మొదటిసారి 1986లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు సుమారు 50వేల మంది హాజరుకాగా, 2024లో కేవలం తెలంగాణ(Telangana)లోనే 3.12లక్షలకు పైగా అభ్యర్థులు ఎప్సెట్ రాశారు.
మూడేళ్లుగా ఎప్సెట్ అభ్యర్థుల వివరాలు
సంవత్సరం రాసిన అభ్యర్థులు
2024 3,12,241
2023 3,01,789
2022 2,37,435
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్గా తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 18 , 2025 | 01:21 PM