DSC Certificate Deadline Extension: స్థానికత కోసం మరొక్క అవకాశం కల్పించాలి
ABN, Publish Date - Jul 05 , 2025 | 01:55 AM
ఆంధ్ర–తెలంగాణ విభజన తర్వాత స్థానికత, ఉద్యోగాలు వంటి అనేక అంశాలకు సంబంధించి లక్షలాది విద్యార్థులు తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు.
ఆంధ్ర–తెలంగాణ విభజన తర్వాత స్థానికత, ఉద్యోగాలు వంటి అనేక అంశాలకు సంబంధించి లక్షలాది విద్యార్థులు తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు. 2014 జూన్ 2 నుంచి 2017 లోపు (మొదట ఆ గడువును ప్రభుత్వం 2017గా నిర్ణయించినా, తర్వాత 2024 వరకూ పొడిగించింది.) రాష్ట్రానికి తిరిగొచ్చిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తామని చెబుతూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం జీవో నెం. 133ను తెచ్చింది. దీని ప్రకారం.. తిరిగొచ్చిన విద్యార్థులు ఏ జిల్లాలో స్థిరపడితే వారు ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణించబడతారు.
2014 నుంచి 2024 వరకూ తెలంగాణ నుంచి ఏపీకి తిరిగి వచ్చినవారు విద్య, ఉద్యోగాలకు సంబంధించి ‘స్థానికులు’ అన్నది స్పష్టం. దీనిపై ప్రభుత్వం, అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పదేళ్లలో అలా తిరిగొచ్చిన విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి అన్ని రకాల సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే ఆ విద్యార్థులు స్థానికులు అని తెలిపే ‘లోకల్ స్టేటస్ సర్టిఫికెట్’ మాత్రం కేవలం 1 జూన్, 2024లోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని జీవో గైడ్లైన్స్లో ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ ఏ విధమైన ప్రచారమూ చేయలేదు.
ప్రస్తుతం డీఎస్సీ వంటి అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ‘లోకల్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, గడువు ముగిసిన కారణంగా ఆ సర్టిఫికెట్ను జారీ చేయలేమని మండల రెవిన్యూ అధికారులు సెలవిస్తున్నారు. ఇంతకాలం ఏ ఉద్యోగాలకూ దరఖాస్తు చేయనందునే ‘లోకల్ స్టేటస్’ సర్టిఫికెట్ తీసుకోలేదని, ఇప్పుడు ఆ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్నామని, లోకల్ సర్టిఫికెట్ లేకపోవడంతో తమకేం చేయాలో పాలుపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం గడువు తేదీపై ముందే అవగాహన కల్పించి ఉంటే తప్పక దరఖాస్తు చేసుకునేవారమని చెబుతున్నారు. ఈ సర్టిఫికెట్ లేకపోవడంతో తాము అటు తెలంగాణ లోనూ, ఇటు ఆంధ్రాలోనూ లోకల్ కాకుండా పోయామని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో త్వరలో డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తమకు ‘లోకల్ సర్టిఫికెట్’ పొందేందుకు మరొక్క అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
– ఎస్కే జానీసైదా, గుంటూరు
Updated Date - Jul 05 , 2025 | 01:55 AM