ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Capital Debate in Andhra Pradesh: రాజధానిపై ద్వేషంతోనే ముంపు వాదనలు

ABN, Publish Date - Sep 04 , 2025 | 01:21 AM

అమరావతి మునిగిపోయిందనే ఒక వార్త మీద కొంచెం తీవ్రంగానే చర్చ జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముంపు నివారణ మార్గాల్ని అన్వేషించడం కోసం.....

మరావతి మునిగిపోయిందనే ఒక వార్త మీద కొంచెం తీవ్రంగానే చర్చ జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముంపు నివారణ మార్గాల్ని అన్వేషించడం కోసం ఈ చర్చ జరుగుతూ ఉంటే దాన్ని అందరూ ఆహ్వానించాలి. అలా కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు అసలు రాజధానే లేకుండా చేయడానికి ఈ వాదనలు ముందుకు వస్తుంటే మాత్రం తీవ్రంగా ఖండించాలి. ఏ ప్రాజెక్టుకు అయినా అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉంటాయి. అనుకూలతల్ని పూర్తిగా వాడుకుంటూ ప్రతికూలతల్ని తగ్గించుకోవడమే మానవ ప్రయత్నం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద నీటి విడుదల గరిష్ఠ సామర్థ్యం 11 లక్షల 90 వేల క్యూసెక్కులు. గత ఏడాది సెప్టెంబరు 1, 2 తేదీల్లో 11 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. గోదావరి, కృష్ణా వరదలకు తోడు బుడమేరు పొంగింది. ఆ రోజు ఇంకొక్క శాతం వరద పెరిగి వుంటే జలప్రళయం సంభవించేది. ఆ నష్టాన్ని ఉహించడానికి కూడా భయం వేస్తుంది. చిత్రం ఏమంటే– రెండు వారాల్లో ప్రజాజీవితం సాధారణ స్థితికి చేరుకుంది. జీవన సౌందర్యం అంటే అదే!

1964 అక్టోబరు నెలలో కృష్ణా నదికి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. విజయవాడ పరిసరాల్లో నదీతీరాన్న ఉన్న నివాసాలు వేల సంఖ్యలో కొట్టుకుపోయాయి. విఖ్యాత ఇంజినీరు డా. కె.ఎల్. రావు పర్యవేక్షణలో విజయవాడ ముంపు ప్రమాదాన్ని నివారించడానికి ఎత్తైన కరకట్ట నిర్మించారు. నదీ పరీవాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్నవారిని నగరం వెలుపల ఉన్న ప్రాంతాలకు తరలించారు. అజిత్‌సింగ్ నగర్ తదితర ప్రాంతాలు అలా ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో అనేక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కరకట్ట నేషనల్ హైవేగా మారింది. హైవేకు ఆవల నదీ పరివాహక ప్రాంతంలో మళ్ళీ నివాసాలు వచ్చి కృష్ణ లంక, పడమటి లంక ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పుడు ఓ పది మునిసిపల్ డివిజన్ల జనం నివసిస్తున్నారు. ప్రతి ఐదేళ్ళకో, పదేళ్ళకో వరద నీళ్ళు నివాసాల్లోకి వచ్చేసి ముంచేస్తుంటుంది. దాంతో వాళ్లు ఆందోళనలు చేసి ఇటీవల రిటైనింగ్‌వాల్ కట్టించుకున్నారు. వరద ముప్పును తప్పించుకున్నారు. ఈ కథ ఇంతటితో ముగియలేదు. 1960లలో కృష్ణా వరద నిర్వాసితులుగా అజిత్‌సింగ్ నగర్ చేరినవాళ్ళు అక్కడా ఇంకో పది డివిజన్ల మేర పెరిగారు. విజయవాడ దుఃఖదాయనిగా భావించే బుడమేరు పరీవాహక ప్రాంతంలోనికి కూడా విస్తరించారు. ఐదేళ్ళకో, పదేళ్ళకో ఒకసారి బుడమేరు కూడా పొంగుతుంటుంది. నివాసాలు మునుగుతుంటాయి. నాలుగు రోజులు రెవెన్యూశాఖ రిలీఫ్ క్యాంపులు నిర్వహిస్తుంది. మళ్ళీ సాధారణ జీవితం మొదలవుతుంటుంది.

గత ఏడాది బుడమేరు మరీ విజృంభించింది. దాదాపు లక్షమందిని బాధితులుగా మార్చేసింది. ముంపు ప్రాంతాల్లోని నివాసాలను తొలగించాలని కొందరు మేధావులు ప్రభుత్వానికి ఉచిత సలహాలు పడేశారు. గట్టున ఉన్నవాళ్లకన్నా నిండా మునిగిన వాళ్ళకు పరిష్కారాలు తోస్తాయి. వాళ్లు కొంచెం విజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. పాములా మెలికలు తిరిగే బుడమేరులో వరద నీరు వేగంగా ప్రవహించదు. అంచేత ముంపు ఎక్కువ రోజులు ఉండిపోతుంది. బుడమేరు స్ట్రెయిట్ కట్ నిర్మిస్తే ప్రవాహ వేగం పెరిగి సమస్య పరిష్కారం అవుతుంది. రిటైనింగ్ వాల్ కూడా నిర్మిస్తే ఇంకా సురక్షితం. కృష్ణానదికి ఎడమగట్టున బుడమేరు కలిసినట్టే కుడిగట్టున కొండవీటి వాగు కలుస్తుంది. దీనికి కూడా అమరావతి దుఃఖదాయని అనే పేరుంది. దీనిని అమరావతి వరప్రదాయనిగా మార్చడం ఎలా అన్నది మన ముందున్న సవాలు. మనకు నిజామ్ ఉదాహరణ ఉంది. 1908 సెప్టెంబరు 28న మూసీనదికి కనీవినీ ఎరుగని వరదలొచ్చి హైదరాబాద్‌ను ముంచెత్తాయి. కనీసంగా 15వేల మంది చనిపోయారు. అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ సుప్రసిద్ధ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి మూడు పనులు అప్పజెప్పాడు: మొదటిది మూసీ వరద క్రమబద్ధీకరణ, రెండోది ముంపు నివారణ, మూడోది తాగునీటి సరఫరా పథకాల రూపకల్పన. 1912లో నిజాం పాలకుడిగా మారిన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ పథకాల నిర్మాణాలను చేపట్టాడు. వరదల్ని చూసి భయపడి దుకాణం బంద్ చేద్దామని అనుకోకపోగా, మూసీ నదిలో చేప పిల్లలు లక్షలు కోట్లుగా పెరుగుతున్నట్టు హైదరాబాద్ జనాభా పెరగాలని ఉస్మాన్ ఆలీ ఖాన్ కోరుకున్నాడట. జనాభా పెరుగుదలకు అవసరమయ్యే తాగునీటిని అంచనా వేసి అపుడే పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాడు. ఆయన కోరుకున్నట్టే హైదరాబాద్ జనాభా కోటి దాటింది. ఆ కాలంలో నిజాం నవాబు నిర్మించిన చెరువులే 1990వ దశాబ్దం వరకూ హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించాయి.

కృష్ణానది కన్నా కొండవీటి వాగు పల్లంలో ఉంటుందని చాలామంది అంటుంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తున్నపుడు కొండవీటివాగు సహజంగానే పైనుంచి అందులో కలుస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నది నీటి మట్టం 27 అడుగుల వరకు పెరుగుతుంది. అప్పుడు వాగులో నీటిని నదిలోనికి ఎత్తిపోయాలి. అలాగే వాగులో వరద లేనప్పుడు కృష్ణానది నీటిని రివర్సబుల్ పంపింగ్ స్కీమ్ ద్వారా ఎత్తిపోయవచ్చు. పంపింగ్ స్కీమ్‌కు ఇప్పుడున్న సామర్థ్యం సరిపోకపోతే దాన్ని పెంచుకోవచ్చు. అలాగే, 29గ్రామాల రాజధాని ప్రాంతంలో ఇతర వాగులతోపాటు కొన్ని చెరువులు కూడా ఉన్నాయి. వీటివల్ల తలెత్తే సమస్యల్ని పరిష్కరించడం కూడా అసాధ్యమేమీ కాదు. ఈ ఏడాది కృష్ణా వరద ప్రమాద హెచ్చరికల స్థాయికి చేరుకున్నా నది నీళ్ళు కరకట్ట దాటలేదు. అమరావతి లోనికి వరద నీరు ప్రవేశించలేదు. ఆగస్టు 12 నుంచి 19 వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయినా, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాదకర ముంపు అంటూ ఏమీలేదు. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. రాయపూడిలో ఒక్కొక్కటి నలభై అంతస్తులుగల నాలుగు ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు. వాటికోసం 100–150 అడుగులకు పైగా పునాది స్తంభాలు (పైల్స్) దించుతున్నారు. ఇక్కడ ఉన్న మూడు టవర్లలో నాలుగో టవర్‌లో వర్షం నీరు చేరింది. పంపు సెట్లు పెట్టి నీళ్ళు తోడుతున్నారు. వర్షాకాలంలో సాగే భవన నిర్మాణపు పనుల్లో ఈ ఇబ్బందులు సహజం. వర్షమో వరదో ఏదో ఒక సాకు చూపి అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఆపాలని ఒక సమూహం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోరాడుతోంది. వీరి వాల్ లోనికి వెళ్ళి చూస్తే వైసీపీతో రాజకీయ అనుబంధం కనిపిస్తుంది.

వైయస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తామన్నారు. కానీ, వైసీపీ అభిమానులు దానికి ఒప్పుకుంటున్నట్టు లేరు. ఆ మధ్య మంగళగిరి–కాజా దగ్గర క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం కురిసింది. ఆ కారణంగా రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో ఆపి, నల్లమల అడవులకు మార్చాలని కొందరు సూచిస్తున్నారు. నల్లమల అడవుల్లో ఏకంగా క్యుమిలోనింబస్ వర్షాలు కురిసిన దాఖలాలున్నాయి. వాటి కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయారన్న విషయాన్ని వైసీపీ అభిమానులు ఇంత త్వరగా మరచిపోవడం ఆశ్చర్యకరం! జగన్ మూడు రాజధానుల సిద్ధాంతం పైకి సమ పంపకంగా కనిపిస్తుంది గానీ, అందులో ఒక బూటకం ఉంది. అమరావతిలో శాసన రాజధాని నిర్మాణాలను ఆయన ప్రభుత్వం కొనసాగించలేదు. విశాఖపట్నంలో పాలనా రాజధాని కోసం నిర్మాణాలను మొదలెట్టలేదు. కర్నూలులో న్యాయ రాజధాని నిర్మాణం అనేది ఆయన చేతుల్లో లేదు. రాష్ట్ర హైకోర్టు ఎక్కడ పెట్టాలనే అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వులివ్వాలి, భారత ప్రధాన న్యాయమూర్తి జడ్జీలను నియమించాలి. అన్ని అనుమతులు వచ్చాక హైకోర్టు భవనాన్ని నిర్మించడం, నిర్వహణ భారం మోయడం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం పని. జాగ్రత్తగా గమ నిస్తే రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేసే పథకం జగన్ మూడు రాజధానుల సిద్ధాంతంలో కనిపిస్తుంది. రాజధాని నిర్మాణం విషయంలో వైయస్ జగన్, చంద్ర బాబులవి పరస్పర విరుద్ధ దృక్పథాలు. తప్పనిసరిగా చేయాల్సిన పనుల్ని కూడా జగన్ చేయరు. చేయలేని పనుల్ని కూడా చంద్రబాబు చేస్తానంటారు. రాజకీయ విభజన ఏ దశకు చేరుకుందంటే ఏపీకి రాజధాని కావాలని కోరేవాళ్ళు తెలుగుదేశం; రాజధాని అక్కరలేదనేవారు వైసీపీగా తయారైంది. చంద్రబాబు మార్కు అతిశయాలను అదుపు చేయడం వేరు, అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేయడం వేరు.

-డానీ సమాజ విశ్లేషకులు

Updated Date - Sep 04 , 2025 | 01:21 AM