ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Balaji Peshwa: బాలాజీ పీష్వా శివాజీ స్వరాజ్య స్వప్నసాధకుడు

ABN, Publish Date - Jul 20 , 2025 | 12:42 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 4వ తేదీన పూనేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ

Balaji Peshwa

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 4వ తేదీన పూనేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రాంగణంలో బాజీరావు పీష్వా విగ్రహాన్ని ఆవిష్కరించి, బాజీరావు యుద్ధ కౌశలాన్ని ఘనంగా కీర్తించారు. ఛత్రపతి శివాజీ స్వరాజ్యకాంక్షను పీష్వాలు వందేళ్ళపాటు కొనసాగించకుంటే, భారతదేశ మౌలిక నిర్మాణం అంతరించిపోయి ఉండేదన్నారు అమిత్‌షా.

‘‘ఛత్రపతి శివాజీ, శంభాజీల మరణం తర్వాత ఏమి జరిగింది?’’ శంభాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి ఆయన భార్య ఏసుబాయి తన ఏడేళ్ల కుమారుడిని కాకుండా, తన మరిది, శంభాజీ తమ్ముడైన రాజారామ్‌ను సింహాసనాధిష్ఠుణ్ణి చేసింది. శంభాజీని గెలిచాను కదా, ఇక మరాఠా సామ్రాజ్యం తన వశమైనట్లేనని ఔరంగజేబు కన్న కల మళ్ళీ వక్రీకరించి, ఆయన ఢిల్లీకి వెళ్లకుండా దక్షిణ భారతంలోనే మళ్లీ యుద్ధంలో కూరుకుపోయాడు. మరాఠాలు వారికే ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆ పశ్చిమ కనుమల్లో ఔరంగజేబు సైన్యాల్ని చికాకుపరిచి ఓడించారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఛత్రపతి రాజారామ్‌ ఉంటున్న జింజికోటను ముట్టడించిన మొగల్‌ సైన్యానికి రాజారామ్‌ చిక్కలేదు. పైగా, 1698లో సతారను కూటమి కేంద్ర స్థానంగా చేసుకుని మొగలులపై యుద్ధం సాగించాడు. ఆయన చేసిన యుద్ధాల్లో ఎంతో సహకరించి కీలకమైన గెలుపులకు కారణమైన సేనాపతి శాంతాజీ గోర్పడే, ధనాజీ జాదవ్‌ల ప్రతాపాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిందే. శాంతాజీ పేరు చెబితే మొగల్‌ సైన్యం ఎలా హడలిపోయేదో మొగల్‌ల సమకాలికుడైన పర్షియన్‌ చరిత్రకారుడు ‘ఖాఫిఖాన్‌’ ఏమి చెప్పాడో చూడండి. ‘‘మరాఠాల సైన్యాధిపతి శాంతాజీని ఎదుర్కొనే ప్రతివాడూ చావనైనా చచ్చేవాడు, లేక బందీగానైనా చిక్కేవాడు, మొగల్‌ చక్రవర్తి కొలువులో ఏ సర్దార్‌కూ అతనిని నిరోధించేందుకు ధైర్యం చాలేది కాదు.’’ 1699 డిసెంబర్‌ 22న రాజారామ్‌ రాసిన ఈ లేఖను చూస్తే మొగలులపై ఆయన సాధించిన కీలక విజయం మనకు అర్థమవుతుంది. ‘‘మేము ఔరంగాజేబు సైనిక శిబిరంపై దాడి చేసి ఆయన కుమార్తెనే బందీగా చేసుకున్నాం.. త్వరలోనే ఔరంగాజేబును పూర్తిగా ఓడిస్తాం.’’ 1700 మార్చి 2న పిన్న వయసులోనే రాజారామ్‌ జబ్బుపడి, ఆకస్మికంగా మరణించాడు.

అనంతరం రాజారామ్‌ భార్య తారాబాయి తన సైనిక వ్యూహాలతో మొగల్‌లపై పోరాటాన్ని ఒక ప్రజాయుద్ధంగా మార్చివేసింది! దీంతో మరాఠాలకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరాఠాల విజయ పరంపరతో మొగలుల సైన్యం నానాటికీ క్షీణించింది. మరాఠాలపై విజయం ఎండమావిగా మారడంతో ఔరంగజేబు మనోవేదనతో కృంగి కృశించి తన 88వ యేట అహ్మద్‌నగర్‌లో చనిపోయాడు. మొగల్‌ పాలకులు అక్బర్‌ నుంచి ఔరంగజేబు వరకు దశాబ్దాల పాటు రాజ్యం పాలించగా, ఔరంగజేబు మరణానంతరం గద్దె నెక్కిన మొగల్‌ బాదుషాలు పట్టుమని ఐదేళ్లు కూడా కొనసాగలేదు. ఒక్కో సంవత్సరంలో అయితే ఇద్దరు గద్దెనెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. తండ్రి ఎప్పుడు కాలం చేస్తాడా, తను ఎప్పుడు గద్దెనెక్కాలా! అని ఎదురు చూసిన ఔరంగజేబు కుమారుడు ‘మువాజం’, తండ్రి మరణానంతరం గద్దెనెక్కాడు. అటు తర్వాత ఐదు సంవత్సరాలకే 1712లో చనిపోయాడు. ‘మువాజం’ మరణానంతరం ఢిల్లీ సింహాసనం సార్వభౌమత్వాన్ని కోల్పోయి దర్బార్‌లో ఉన్న సర్దార్ల చేతిలోకి వెళ్లిపోయింది! అటు తర్వాత వరుసగా ఆ గద్దెనెక్కిన మొగల్‌ బాదుషాలు కాస్తా, సర్దార్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. మొగలుల మంత్రి జుల్ఫికర్‌ అలీ ఖాన్‌, మువాజంకు పుట్టిన ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన జహందర్‌ షాను చేరదీసి, మిగతా వాళ్ళని చంపివేశాడు. తరువాత అతడిని ఢిల్లీ సింహాసనం మీద ఒక సంవత్సరం మాత్రమే కూర్చోబెట్టాడు.

ఇక ఇక్కడ మరాఠాల విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మనవడైన ‘సాహూ’, మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా 1708 జనవరిలో సింహాసనమెక్కాడు. ఉమ్మడి శత్రువైన మొగల్‌ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమై నానాటికీ కుంచించుకుపోయాక.. మరాఠా యోధులలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. వాళ్ళలో వాళ్లే తగవులు పడి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఈ సందర్భంలోనే జాతీయ స్వరాజ్య యవనికపై ముందుకు వచ్చాడు బాలాజీ పీష్వా. పీష్వా అంటే ఛత్రపతి యొక్క ప్రధానమంత్రి. ఈయన కింద పనిచేసే అష్ట ప్రధానులనే మంత్రులు ఉంటారు. ఈ బాలాజీ పీష్వానే మరాఠా సామ్రాజ్యంలో అత్యంత బలవంతుడైన ‘కన్హోజీ ఆంగ్రే’ను ఛత్రపతికి ఎదురు తిరిగిన సందర్భంలో ఒప్పించి, జాతీయవాద స్వరాజ్య పోరాటంలో ఆయనను భాగం చేశాడు. అసంతృప్తితో ఉన్న మిగతా మరాఠా సర్దార్లను అందరినీ కలిపి శత్రువుకు వ్యతిరేకంగా పరస్పర సహకార పద్ధతిలో మరాఠా మహా మండల్‌ స్థాపించాడు. దాంతో మొగలులు ఆశించినట్టుగా మరాఠాలు విడి పోకుండా మహా మండల్‌ పేరుతో వాళ్లంతా ఐక్యమయ్యారు. ‘‘మహా మండల్‌ తర్వాత నూరేళ్లపాటు దేశం మొత్తాన్ని మరాఠాలు నియంత్రించారు. అటు గుజరాత్‌ నుంచి ఇటు దక్షిణాన కర్ణాటక వరకు వాళ్లదే సామ్రాజ్యం. చివరికి ఢిల్లీ దర్బార్‌ను కూడా వారే నియంత్రించారు. వారి ప్రయోజనాలకు తగ్గట్టుగానే ఢిల్లీ దర్బారులో ఉన్న పాదుషాలను తమ చేతిలో కీలుబొమ్మలుగా చేసుకొని ఆడించారు. బేసన్‌ నుంచి పోర్చుగీసు వారిని ఓడించి తరిమేశారు. ఇంగ్లీష్‌ వారితో సమాన స్థాయిలో రెండు యుద్ధాలు చేశారు. పానిపట్‌ యుద్ధంలో ఘోర పరాజయాన్ని కూడా తట్టుకొని ఢిల్లీలోనూ, ఉత్తర భారతంలోనూ తమ స్వరాజ్యాన్ని స్థాపించగలిగారు.

మరాఠా గొప్ప యోధులందరినీ ఛత్రపతి సాహు పక్షాన కూడగట్టి, ధమాజీ, ధోరాట్‌ లాంటి బందిపోట్ల ముఠాలను బల ప్రయోగంతో అణిచివేసి, రాజ్యంలో శాంతి స్థిరత్వాలను మెరుగుపరిచాక బాలాజీ పీష్వా మొగలులపై దృష్టి పెట్టాడు. మొగల్‌ రాజ్యంలో భాగాలైన ఔరంగాబాద్‌, బేరార్‌, ఖాన్దేశ్‌, బీదర్‌, గోల్కొండ, బీజాపూర్‌ రాజ్యాలలో వసూలయ్యే ‘చౌథ్‌’ పన్నులను తమకే చెల్లించాలని అప్పటి ఢిల్లీ గద్దెపై ఉన్న మొగల్‌ కీలుబొమ్మ బాదుషా ‘ఫారుక్‌ షియార్‌’ని కోరాడు. 1713లో జహందర్‌ షా మరణానంతరం ఆయన వారసుడిగా ఈ ఫారూక్‌ షియార్‌ను సయ్యద్‌ సోదరులని పిలవబడే మొఘల్‌ సర్దార్లు ఢిల్లీ గద్దె నెక్కించారు. అప్పటికే మొగల్‌ సామ్రాజ్యం కేవలం ఢిల్లీ నగరానికి మాత్రమే పరితమైంది. బాలాజీ పీష్వా పెట్టిన ప్రతిపాదనను ఈ ఫారూఖ్‌ షియార్‌ ఒప్పుకోక, మరాఠాలతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. 50వేల సైన్యంతో ఢిల్లీని ముట్టడించిన బాలాజీ పీష్వా, ఫారుక్‌ షియార్‌ని ఓడించాడు.. గద్దెనెక్కించిన సయ్యద్‌ సోదరులే షియార్‌ను ఖైదులో చంపివేశారు. మరో కీలుబొమ్మ ప్రభువైన మహమ్మద్‌ షాను ఢిల్లీ గద్దెపై మొగల్‌ ప్రభువుగా కూర్చోబెట్టారు.

ఈ మహమ్మద్‌ షానే దక్షిణ భారతదేశంలో వసూలయ్యే పన్నును మరాఠాలకే సమర్పిస్తానని ఒప్పందానికి వచ్చాడు. అంటే ఈ ఒప్పందంతో మొగలులు మారాఠాలకు సామంతులుగా మారారని అర్థం! శివాజీ కలలు కన్న నిజమైన స్వరాజ్యాన్ని బాలాజీ పీష్వా ఇలా సాకారం చేశాడు. దీని తర్వాతనే మరాఠాలైన పీష్వాలు ఛత్రపతుల స్థానంలో స్వరాజ్య స్థాపకులుగా మారారు. తర్వాత బాలాజీ పీష్వా కుమారుడైన బాజీరావు, ఛత్రపతి ‘‘సాహు’’ కొలువులో పీష్వాగా నియమించబడ్డాడు. రాజసభ మందిరంలో పైకప్పును దాదాపుగా తాకే నిలువెత్తు విగ్రహం, స్పష్టంగా ఖంగున మోగే గొంతు, ధైర్యం, పౌరుషం ఉట్టిపడే ముఖ కవళికలు, దర్పంతో ఆకట్టుకునే నల్లటి కళ్ళు, అన్నిటికీ మించి అనర్గళ వాగ్ధాటి... ‘నేను మరాఠా పతాకాన్ని సింధూ నది తీరాన ప్రతిష్ఠిస్తాను’ అని ఛత్రపతి సాహు వైపు చూస్తూ గంభీరంగా పలికాడు. బాజీరావు మొగలుల దక్కన్‌ సుబేదారైన నిజామును పాల్‌కేడ్‌లోను ఆ తర్వాత భోపాల్‌లోను చిత్తుగా ఓడించాడు. సిద్దిలు, పోర్చుగీసు వారు ఆక్రమించిన మరాఠా ప్రాంతాలను కూడా విముక్తం చేశాడు. రాజపుత్రుల సహాయంతో ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా జయించి, మొగలుల మహా సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేశాడు. ఇదీ, సంక్షిప్తంగా గ్రేట్‌ మారాఠాల చరిత్ర... అంటే.. మన చరిత్ర!

-డా. అంబటి శ్రీనివాస్‌రాజు

(‘మన కాకతీయులు’ గ్రంథకర్త)

Updated Date - Jul 20 , 2025 | 12:42 AM