Farmer Rights: అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రథమ మహాసభలు
ABN, Publish Date - Aug 23 , 2025 | 05:08 AM
అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో విడివిడిగా పనిచేస్తున్న రైతు సంఘాలు 2024 డిసెంబర్లో కలకత్తాలో సమావేశమై అఖిల భారత ఐక్య..
అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో విడివిడిగా పనిచేస్తున్న రైతు సంఘాలు 2024 డిసెంబర్లో కలకత్తాలో సమావేశమై అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎఐయుకేఎస్)గా ఏర్పడ్డాయి. ఈ సంఘం అనేక రైతు సమస్యలపై పోరాడుతున్నది. సాగు సమస్యల పరిష్కారానికి, రైతు రక్షణకు, కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దీనిని అర్థం చేసుకున్న ఎఐయుకెఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)తో కలిసి పనిచేస్తున్నది. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించి, ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం’ రూపంలో మోదీ ప్రభుత్వం మళ్లీ వీటిని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఎఐయుకేఎస్, ఎస్కేఎంతో కలిసి పోరాడుతున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని కూడా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఆగస్టు 25, 26 తేదీలలో మహబూబ్నగర్లో ఎఐయుకేఎస్ ప్రథమ మహాసభలు జరుగనున్నాయి. ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఇండస్ట్రియల్ ఏరియా గ్రౌండ్ నుంచి రైతు మహా ప్రదర్శన జరుగుతుంది. అనంతరం మూడు గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో బహిరంగసభ జరుగుతుంది. ఈ సభలో కెచ్చెల రంగారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, పోటు రంగారావు, ఎం.దామోదర్రావు, గుమ్మడి నర్సయ్య, వి.ప్రభాకర్, ఎం.కృష్ణ, ఎం.హన్మేశ్, బి.రాము, సిహెచ్.రాంచందర్ ప్రసంగిస్తారు. ఆగస్టు 26న రాయల చంద్రశేఖర్నగర్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఇందులో జస్టిస్ చంద్రకుమార్, విమల్ త్రివేది, కె.జి.రాంచందర్, ఎస్.ఎల్.పద్మ ప్రసంగిస్తారు.
– అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ
Updated Date - Aug 23 , 2025 | 05:08 AM