మళ్లీ 75,000 పైకి సెన్సెక్స్
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:39 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,131.31 పాయింట్ల (1.53 శాతం) వృద్ధితో 75,301.26 వద్దకు చేరుకుంది....
ఒక్క రోజులో 1,131 పాయింట్ల్ల పెరుగుదల
22,800 ఎగువ స్థాయిలో ముగిసిన నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్ల ర్యాలీతో కొనుగోళ్ల జోష్
2 రోజుల్లో రూ.8.67 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,131.31 పాయింట్ల (1.53 శాతం) వృద్ధితో 75,301.26 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 325.55 పాయింట్లు (1.45 శాతం) బలపడి 22,834.30 వద్ద స్థిరపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడనుందన్న అంచనాలు, ఫెడ్ రేట్ల తగ్గింపు ఆశలు, అమెరికా, చైనాలో రిటైల్ విక్రయాల తాజా గణాంకాలు అత్యంత సానుకూలంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ ట్రెండ్ బుల్లి్షగా మారింది. దాంతో దేశీయ మదుపరులూ జోరుగా కొనుగోళ్లకు పాల్పడటం సూచీల ర్యాలీకి ప్రధానంగా దోహదపడింది. ముడి చమురు సెగలు కాస్త తగ్గడంతో పాటు డాలర్ సూచీ బలహీనపడటం కూడా మార్కెట్లకు కలిసివచ్చింది. క్రితం సెషన్లోనూ సూచీలు మోస్తరుగా లాభపడ్డాయి. గడిచిన రెండు రోజుల్లో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.67 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.399.85 లక్షల కోట్లకు (4.61 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే మార్కెట్ సంపద రూ.7 లక్షల కోట్ల మేర పుంజుకుంది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 26 రాణించాయి.
ఫిజిక్స్వాలా రూ.4,600 కోట్ల ఐపీఓ
ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ ఫిజిక్స్వాలా పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా రూ.4,600 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి గోప్య ప్రీ-ఫైలింగ్ విధానంలో ప్రాథమిక ముసాయిదా పత్రాలు(డీఆర్హెచ్పీ) సమర్పించినట్లు తెలిసింది.
ఎల్జీ ఐపీఓకు సెబీ ఆమోదం
ఎల్జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియా లిమిటెడ్ రూ.15,000 కోట్ల ఐపీఓతో పాటు మ్యాన్పవర్ అండ్ టోల్ ప్లాజాల నిర్వహణ సేవల సంస్థ ఇన్నోవిజన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా ఇన్నోవిజన్ రూ.255 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లకు చెందిన 17.72 లక్షల ఈక్విటీ షేర్లను సైతం విక్రయించనుంది.
రూ.91,000
దాటిన బంగారం
దేశీయంగా పసిడి ధర తొలిసారిగా రూ.91,000 దాటింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు మరో రూ.500 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠ స్థాయి రూ.91,250కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.90,800 స్థాయికి ఎగబాకింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలు, ఇజ్రాయెల్-గాజా మధ్య మళ్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరడం ఇందుకు కారణమైంది. కిలో వెండి మాత్రం క్రితం రోజు స్థాయి రూ.1,02,500 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 3,047.50 డాలర్లు, సిల్వర్ 35 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 19 , 2025 | 05:39 AM