Indian Paint Market: జేఎస్డబ్ల్యూ చేతికి అక్జో నోబెల్
ABN, Publish Date - Jun 28 , 2025 | 05:22 AM
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ గ్రూప్ పెయింట్స్ వ్యాపారంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసే పెయింట్స్ సంస్థ అక్జో నోబెల్ భారత అనుబంధ...
డీల్ విలువ రూ12,915 కోట్లు.. పెయింట్స్ రంగంలో భారీ టేకోవర్
న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ గ్రూప్ పెయింట్స్ వ్యాపారంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసే పెయింట్స్ సంస్థ అక్జో నోబెల్ భారత అనుబంధ సంస్థ అక్జో నోబెల్ ఇండియాను రూ.12,915 కోట్లకు జేఎ్సడబ్ల్యూ పెయింట్స్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆ కంపెనీ ఈక్విటీలో నెదర్లాండ్స్ కంపెనీకి ఉన్న 74.76 శాతం వాటాను రూ.8,986 కోట్లకు కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రజల వద్ద ఉన్న మిగతా 25 శాతం వాటా షేర్లను ఒక్కో షేరు రూ.3,417.77 చొప్పున రూ.3,929.06 కోట్లకు కొనుగోలు చేసేందుకు త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది.
అతిపెద్ద డీల్
మన దేశ పెయింట్స్ రంగంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద టేకోవర్గా భావిస్తున్నారు. అక్జో నోబెల్ ఇండియా కొనుగోలుతో దేశ పెయింట్స్ మార్కెట్లో ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ తర్వాత జేఎస్డబ్ల్యూ పెయింట్స్ నాలుగో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్తో సహా ఇటీవల అనేక కంపెనీలు పెయింట్స్ వ్యాపారంలోకి ప్రవేశించాయి. దీంతో ఈ పోటీని ఎదుర్కోవడంతో పాటు తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు అక్జో నోబెల్ కొనుగోలు ఉపయోగపడుతుందని జేఎస్డబ్ల్యూ పెయింట్స్ భావిస్తోంది. అయితే ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)తో పాటు పలు రెగ్యులేటరీ సంస్థల అనుమతి అవసరం. ఈ కొనుగోలుకు అవసరమైన రూ.12,915 కోట్లలో రూ.4,000 కోట్లను జేఎస్డబ్ల్యూ గ్రూప్ రుణాల ద్వారా సేకరించనుంది. ఇందుకోసం ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో జేఎ్సడబ్ల్యూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Updated Date - Jun 28 , 2025 | 05:24 AM