ఓరి.. నాయనో..!
ABN, Publish Date - Aug 30 , 2025 | 12:23 AM
డీఎస్సీ-2025 నియామకాల పక్రియలో రాష్ట్రశాఖ కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలు అభ్యర్థులను అయోమయంలోకి నెడుతున్నాయి. గతంలో డీఎస్సీ ఎంపిక జాబితాను మెరిట్, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను కూర్చోబెట్టి జిల్లాస్థాయిలో విద్యాశాఖ ఒకేసారి విడుదల చేసేది. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు.
ఇంకా 50మందికిరాని మెసేజ్లు
పారదర్శకత పేరుతో అభ్యర్థులతో ఆటలు
రెండోరోజు కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం విద్య, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025 నియామకాల పక్రియలో రాష్ట్రశాఖ కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలు అభ్యర్థులను అయోమయంలోకి నెడుతున్నాయి. గతంలో డీఎస్సీ ఎంపిక జాబితాను మెరిట్, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను కూర్చోబెట్టి జిల్లాస్థాయిలో విద్యాశాఖ ఒకేసారి విడుదల చేసేది. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు. అందులో ఏమైనా తేడాలుంటే వారిని జాబితా నుంచి తప్పించి, ఆ తర్వాతి స్థానంలో ఉన్న అదే రోస్టర్ పాయింట్ అభ్యర్థికి మెరిట్ ఆధారంగా కూర్చోబెట్టేవారు. ఇపుడు డీఎస్సీ సెలెక్షన లిస్టు మొత్తం రాష్ట్రశాఖ నుంచే తయారుచేసి పంపుతున్నారు. అదికూడా ఒకేసారి కాకుండా రోజుకు కొన్ని పంపిస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం, ఆందోళన నెలకొన్నాయి. అనంత జిల్లాకు 807 టీచర్ పోస్టులకు జాబితా పంపాల్సి ఉంది. మూడురోజులైనా పూర్తిస్థాయి జాబితా రాలేదు. తొలిరోజు జిల్లాలో 625 మంది అభ్యర్థులకు సెలెక్ట్ల జాబితాలో ఉన్నట్లు మెసేజ్లు రాష్ట్రశాఖ నుంచి పంపారు. వీరందరికీ గురువారం జిల్లాకేంద్రంలోని పీవీకేకే కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. గురువారం మరో 132 మందికి మెసేజ్లు పంపారు. వారికి శుక్రవారం సర్టిపికెట్ల పరిశీలన చేపట్టారు. ఈలెక్కన ఇంకా జిల్లాలో 50 మంది అభ్యర్థులకు శుక్రవారం రాత్రి వరకు మెసేజ్లు రాలేదు. దీంతో మెసేజ్లు వస్తాయా, రావా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరైతే మిగిలిన వారికి ఎప్పుడు మెసేజ్లు వస్తాయోనని సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రానికి వచ్చి విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులను ప్రాధేయపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు సైతం వీటిపై క్లారిటీ ఇవ్వట్లేదు. మెసేజ్లు వస్తాయని చెప్పి పంపుతున్నారు. మొత్తంమీద పారదర్శకత పేరుతో రాష్ట్ర అధికారులు.. డీఎస్సీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
కొనసాగిన పరిశీలన
డీఎస్సీ సెలెక్ట్లిస్టులో ఉన్న అభ్యర్థులకు రాష్ట్రశాఖ మెసేజ్లు పంపిస్తోంది. అలా జిల్లాలో రెండురోజుల్లో 757 మందికి మెసేజ్లు వచ్చినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. వీరిలో గురు, శుక్రవారాల్లో 748 మంది సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారనీ, 9 మంది రాలేదన్నారు. ఈగైర్హాజరైన వారిలో కొందరు వచ్చినా వారి సర్టిఫికెట్లలో తేడాలు ఉండడంతో తీసుకురావడానికి కొందరు వెళ్లారన్నారు. మరికొందరు సమాచారం తెలీక రాలేదనీ, అలాంటి వారికి ఫోన్లు చేసి, సమాచారం ఇచ్చి పిలిపించుకుంటున్నామని డీఈఓ తెలిపారు. ఎంపిక జాబితాలో ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చి, సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నామన్నారు మిగిలిన 50మంది అభ్యర్థులకు శనివారం ఉదయంలోగా మెసేజ్లు వచ్చే అవకాశం ఉందనీ, రాగానే వారు పీవీకేకే కాలేజీకి వచ్చి సర్టిఫికెట్లను పరిశీలించుకోవాల్సి ఉంటుందని డీఈఓ వివరించారు.
Updated Date - Aug 30 , 2025 | 12:23 AM