హైకోర్టు బెంచ ఎందుకు పెట్టలేదు?
ABN, Publish Date - May 24 , 2025 | 11:43 PM
కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ ఇంతవరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి
కర్నూలు కల్చరల్, మే 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ ఇంతవరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కవులు, కార్టూనిస్టులు, పాత్రికేయులు ఏమి రాసినా సహించలేని లక్షణం పెరిగిపోతోందని, అది ఆమోదించలేని పరిణామమని అన్నారు. భావ ప్రకటన, విమర్శనాత్మక స్వచ్ఛ మీద దాడి ఆందోళన కలిగించే విషయమన్నారు. కర్నూలులో కవి వెంకటేశ్వర్లు కవిత రాస్తే పోలీసులు నిర్భంధించడం సరికాదన్నారు. కర్నూలుకు ప్రకటించిన న్యాయ విశ్వ విద్యాలయం వేరేచోట పెట్టాలని నిర్ణయించారని, ఇలా ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. దీన్నివల్ల ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయన్నారు. గతంలో జరిగిన రాయలసీమ ఉద్యమం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. బనకచర్ల ప్రైవేటు ప్రాజెక్టు అనడం ఏమిటని, విద్య, వైద్యం, రోడ్లు ఇలా అన్నీ ప్రైవేటీకరణ చేసి ఇప్పుడు ప్రాజెక్టులు కూడా ప్రైవేటీకరణ చేస్తే ఏమవుందని ప్రశ్నించారు. కడపలో ఉన్న ఏపీజీబీ అమరావతికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంశాలపై సాహితీ స్రవంతి కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్మరణీయుల జాబితాను సవరించాలని, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామ్మూర్తి పేర్లను ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం ఎవరూ వద్దనడం లేదని, తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రంగస్థల కళలు, షార్ట్ఫిలిమ్స్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడిటోరియాలను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంపీ బసవరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల బసప్ప, చక్రపాణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:43 PM