కందిపప్పు ఎప్పుడిస్తారో ?
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:08 AM
రేషన్ దుకాణాల ద్వారా అందించే కందిపప్పు ఈ నెల కూడా అందలేదు.
మార్కెట్లో కిలో రూ.120.. చౌకడిపోలో రూ.67
గణపవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాల ద్వారా అందించే కందిపప్పు ఈ నెల కూడా అందలేదు. పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులపైనే ఆధారపడతారు. మార్కెట్లో నిత్యావసరాల ధరలు రోజురోజు పెరిగిపోవడంతో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్ దుకాణాల్లో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. గడిచిన 5 నెలలుగా కందిపప్పు సరఫరా కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి కేటాయింపులు లేకపోవడంతో డీలర్లు సైతం డీడీలు కట్టడం లేదు. చౌక దుకాణాల వద్దకు వెళ్లిన వినియోగ దారులు కందిపప్పు లేదనే సమాధానం వస్తుండటంతో పెదవి విరుస్తున్నారు. ఈ నెలలో నైనా ఇస్తారని అనుకుంటే కందిపప్పు రాలేదని చౌకడిపో డీలర్లు చెబుతున్నారు. గోదాములకు కందిపప్పు రాకపోవడం వలన కేటాయింపులు జరగలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.120కి విక్రయిస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా కిలో రూ.67కి అందజేసేవారు. కందిపప్పుతో పాటు గోధుమపిండి, రాగులు, గోధుమలు, జొన్నలు అందిస్తారని ఆశతో ఎదరు చూస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరాశే ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5,58,019 రేషన్ కార్డులుండగా 1052 చౌక దుకాణాలున్నాయి. ప్రతీ నెల 588 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరమవు తుంది. సెప్టెంబర్ నెల అయినా కందిపప్పు సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Aug 04 , 2025 | 12:08 AM