పేదలకు నాణ్యమైన బియ్యం
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:24 AM
పేదలకు నాణ్యమైన బియ్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్గా అమలు
బియ్యంలో నూక శాతం కోత
ఇప్పటివరకు కింటాలు బియ్యంలో
25 శాతం నూక.. 10 శాతానికి తగ్గింపు
పేదలకు నాణ్యమైన బియ్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో సమూల మార్పులు చేయనుంది. రైస్ మిల్లర్ల నుంచి 25శాతం నూకతో బియ్యం సేకరిస్తోంది. ఇకపై 10శాతం నూకతో మాత్రమే బియ్యాన్నే తీసుకునేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో బియ్యం సేకరణ పైలట్ ప్రాజెక్ట్గా చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి 6500 టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు అప్పగించారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరిసాగుతో రైస్ మిల్లులు ధాన్యంతో రద్దీగా ఉంటాయి. పది శాతం నూకతో ప్రభుత్వ బియ్యం సేకరిస్తే మిగిలిన 15 శాం నూక పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. మిల్లర్లకు నూక నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే నూక నాణ్యత కోల్పోవడమే కాక పురుగు పట్టే అవకాశాలు ఎక్కువ. భారత ఆహార సంస్థ ద్వారా కేంద్రం సేకరించేంత వరకు మిల్లుల్లో భద్రపరచుకోవాలంటే కష్టసాధ్యమని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం ఎన్నాళ్లు ఉంచినా దెబ్బతిన వు. మరాడించిన బియ్యం నిల్వ చేయడం రైసుమిల్లు లో సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అప్ప గించేస్తుంటారు. కేంద్రం తాజా నిర్ణయంతో రైస్ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
నష్టం పూడుస్తారా..?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ బియ్యంలో 25 శాతం నూకతో తీసుకుంటోంది. ఇకపై 10శాతం నిబంధనతో మిగిలిన 15 కిలోలు బియ్యం రూపంలో మిల్లర్లు అప్పగించాలి. దీనితో మిల్లర్లకు కొంత మేర నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యం ధర రూ.35 పడుతోంది. నూక రూ.23 ధరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు 15 కిలోలు నూకకు బదు లు బియ్యం అప్పగించాల్సి ఉండడంతో క్వింటాల్కు రూ.180 నష్టపోనున్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేయను న్నట్టు కేంద్రం ప్రకటించినా నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఎంత మేర భర్తీ చేస్తుందనే విషయంపై మిల్లర్లు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం రూ.180 నష్టాన్ని బియ్యం రూపంలో తగ్గిం చాలంటూ మిల్లర్ల డిమాండ్. ప్రస్తుతం కస్టమ్ మి ల్లింగ్ అమలుతో మిల్లులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ ధాన్యం ఇస్తే మిల్లర్లు 67 కిలో లు బియ్యాన్ని ఇస్తున్నారు. కేంద్రం 25 నుంచి 10 శాతానికి నూక తగ్గించడంతో క్వింటాల్కు తీసుకునే బియ్యం పరిమాణం తగ్గించాలని మిల్లర్ల డిమాండ్.
రాష్ట్రంలో 15శాతం నూక
ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం 15శాతం నూకతో బియ్యం తీసుకుంటోంది. తాలు, తప్పలు 1.5శాతం మాత్రమే ఉండాలని స్పష్టం చే సింది. దీనికోసం మిల్లర్లు సార్టెక్స్ యంత్రాలను అమర్చుకున్నారు. ప్రభుత్వం 25 శాతానికి బదులుగా 15శాతం నూకతో బియ్యం సేకరిస్తుండడంతో మిల్ల ర్లుకు నూక వ్యత్యాసం, సార్టెక్స్ చార్జీల రూపంలో క్వింటాల్ పై రూ.110 చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 10 శాతానికి తగ్గించింది. ఫలితంగా బియ్యం, నూక ధరలో వ్యత్యాసం రూ.180 ఉంటోంది.
ఇథనాల్కు నూక
బియ్యం సేకరణలో నూక శాతం తగ్గింపు నిర్ణయం తీసుకున్న కేంద్రం మిగిలిన 15శాతం నూకను మిల్లర్ల నుంచి సేకరించి ఇథనాల్ ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీలకు అప్పగించే యోచనలో ఉంది. దీనితో రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా కావడంతో పాటు నూక ఇథనాల్కు వెళ్లడం మంచి నిర్ణయమని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం నూక సేకరించే వరకు మిల్లుల్లోనే నిల్వ ఉంచాలన్న నిర్ణయమే చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రం సానుకూలం
తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు కేంద్ర ప్ర భుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలతతో ఉంది. బియ్యంతోపాటే నూక కూడా తీసుకోవాలన్న డిమాండ్ మిల్లర్ల నుంచి వినిపిస్తోంది. లేదంటే నూకను మిల్లర్లకు విడిచిపెట్టేయాలని ప్రతిపాదిస్తున్నారు. క్వింటాల్ బియ్యానికి అయ్యే వ్యత్యాసాన్ని నగదుకు బదులుగా బియ్యం రూపంలో తగ్గించాలన్న డిమాండ్ మిలర్లనుంచి వినిపిస్తోంది. లేని పక్షంలో మిల్లింగ్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రైతులతో బేరసారాలు సాగించి నూక శాతం అధికంగా ఉందని కోత విధిస్తారు. కేంద్రం నిర్ణయంతో నష్టంవస్తే రైతుల వద్ద కోత పెట్టే ప్రమాదం కూడా ఉంది.
జిల్లాలో రెండు సీజన్లలో ధాన్యం సేకరిస్తున్నారు. ఫలితంగా మిల్లులవద్ద నిల్వ సామర్థం కూడా తక్కువగా ఉంటుంది. రెండు సీజన్లలో దాదాపు 7 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తుంటారు. దీనికి సంబంధించి సుమారు రూ.1.05 లక్షల టన్నుల నూక నిల్వ చేయాల్సి ఉంటుంది. అంత సామర్థ్యం మిల్లుల వద్ద లేదు. పైలెట్ ప్రాజెక్ట్ ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10శాతం నూకపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
నిల్వ చార్జీల్లో గందరగోళం
మిల్లుల్లో నిల్వ చేయడానికి క్వింటాల్కు అదనంగా రూ. 1.23 ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా నిల్వ చార్జీలే ఇవ్వడం లేదు. ఎంత అనేది మిల్లర్లకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా నూక నిల్వలకు కూడా చార్జీలు చెల్లించరనే అనుమానాలు మిలర్లలో నెలకొంది. ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తే క్వింటాల్కు రూ.10 చెల్లిస్తున్నారు. మిల్లర్లకు అటువంటి అవకాశం లేదు. ఇది కూడా మిల్లర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
Updated Date - Jul 19 , 2025 | 12:24 AM