బదిలీలు..అంతలోనే డిప్యుటేషన్లు!
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:29 AM
బదిలీ ఉత్తర్వు లందుకున్న అధికారిపేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిబం ధనలకు విరుద్దంగా పలువురికి డెప్యుటేషన్లు, పనిస్థానాల సర్దుబాట్లు కొనసాగుతుండడం ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశ మైంది.
మరో జిల్లాకు బదిలీ అయిన అధికారి పేరిట సర్దుబాట్లు.. పని స్థానాల్లో వైద్యసేవలకు విఘాతం
ఏలూరు అర్బన్, జూలై 4(ఆంధ్రజ్యోతి): బదిలీ ఉత్తర్వు లందుకున్న అధికారిపేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిబం ధనలకు విరుద్దంగా పలువురికి డెప్యుటేషన్లు, పనిస్థానాల సర్దుబాట్లు కొనసాగుతుండడం ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశ మైంది.వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగులకు సాధారణ బదిలీ కౌన్సె లింగ్ కొద్దిరోజుల క్రితమే జరిగిన విషయం విదితమే. ఆ మేరకు సీనియార్టీ ప్రాతిపదికన ఆయా కేడర్ల ఉద్యోగులను బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ముగిసి పదిరోజులు కాకుండానే వివిధ ప్రాంతాల్లో నూతన పనిస్థానాల్లో విధులు చేపట్టిన కొందరు ఉద్యోగులు జిల్లా కార్యాలయంలో పైరవీలు చేయడం, ఆ మేరకు నచ్చిన స్థానాలకు సర్దుబాటు చేస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసేయడం చాపకిందనీరులా జరిగిపోతున్నా యి. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని గుడి వాకలంక పీహెచ్సీకి కొద్దిరోజులక్రితమే బదిలీఅయిన మెడి కల్ ఆఫీసర్కు డీఎంహెచ్వో కార్యాలయంలో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించేలా అనుమతించడం కార్యాలయ వర్గాల్లో కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి గుడివాకలంక పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులకుగాను ఒకరు ఇటీవల బదిలీపై నియమితులయ్యారు. మరొకరు బదిలీపై ఇక్కడి పీహెచ్సీలో చేరాల్సివున్నప్పటికీ ఏజెన్సీ మండలంలోని పీహెచ్సీకి నియమితులైన మెడికల్ ఆఫీసర్ ఇంతవరకు విధుల్లోకి చేరేందుకు రాకపోవడంతో గుడివాకలంకలో చేరేం దుకు అవకాశంలేదు. ఈ నేపథ్యంలో గుడివాకలంక పీహెచ్ సీకి ఇద్దరు రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ఒక్కరూ లేకుండానే, సమీపంలోని చాటపర్రు పీహెచ్సీ వైద్యాధికారికి ఇన్చార్జి బాధ్యతలిచ్చి నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధుల్లోలేని విషయాన్ని స్థానిక ప్రజాప్రతి నిధులు జిల్లా అధికారుల వద్ద ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. డీఎంహెచ్వో కార్యాలయంలో బఫర్ డాక్టర్లు, వివిధ విభాగాల్లో సీనియర్లు ఉండగా, క్షేత్రస్థాయిలో వైద్యసేవలందిం చాల్సిన మెడికల్ ఆఫీసర్లను ఆఫీసుకు డిప్యుటేషన్లపై తీసుకు రావడమేంటని ఉద్యోగవర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు ఇటీవలే బదిలీ అయిన జిల్లా అధికారికి నిబంధ నల ప్రకారం డెప్యుటేషన్లు, సర్దుబాట్లు చేయడానికి వెసులు బాటు ఉండబోదని, అయినప్పటికీ కొందరు ఉద్యోగులకు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్గా పనిచేసి కొద్దిరోజుల క్రితమే పెదపాడు పీహెచ్ సీకి బదిలీ అయిన ఉద్యోగిని పదిరోజుల వ్యవధిలోనే తిరిగి డీఎంహెచ్వో కార్యాలయంలో పనిచేసేలా జారీచేసిన ఉత్తర్వు లు, ప్రొబేషన్ డిక్లేర్ కాకుండానే ఏలూరు నుంచి ఒకరిని రాజమహేంద్రవరానికి, టి.నరసాపురం, గోకవరం పీహెచ్సీల కు బదిలీ అయిన ఇద్దరు ఏఎన్ఎంలను ఏలూరు డీఎం హెచ్వో కార్యాలయంలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయడం నిబంధనలకు విరుద్దమేనని చెబుతున్నారు. జిల్లా నుంచి బదిలీ అయిన అధికారి సంతకాలతో డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీచేయడం, కీలకమైన గుడివాకలంక పీహెచ్ సీకి నియమితులైన రెగ్యులర్ వైద్యాధికారి స్థానికంగా వైద్య సేవలందించకుండా డీఎంహెచ్వో కార్యాలయానికి రావడంపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమా చారం.
కాగా జిల్లాకు కొత్త డీఎంహెచ్వోగా డాక్టర్ పి.జాన్ అమృతం ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. గుంటూరు నగరపాలక సంస్థ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్వో)గా పనిచేస్తున్న ఆమెను జిల్లాలో డీఎం హెచ్వోగా బదిలీపై నియమించగా, ఆమె స్థానంలో ఇక్కడి డీఎంహెచ్వో డాక్టర్ మాలినిని నియమించారు. సోమవారం డాక్టర్ జాన్ అమృతం జిల్లాలో బాధ్యతలు చేపడతారని తెలిసింది.
Updated Date - Jul 05 , 2025 | 12:29 AM