కొంగ్రొత్తగా ఇంటర్ తరగతులు
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:34 AM
వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవు తున్నాయి. ఈ ఏడాది నుంచి నూతన విద్యావిధానాన్ని ఇంటర్ విద్యలో ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేసే విధంగా పలు సంస్కరణలతో విద్యార్థులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టింది.
రేపటి నుంచే జూనియర్ కాలేజీలు ప్రారంభం
ఏలూరు జిల్లా డీఐఈవో శేఖర్బాబు
ఏలూరు అర్బన్, మే 31 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవు తున్నాయి. ఈ ఏడాది నుంచి నూతన విద్యావిధానాన్ని ఇంటర్ విద్యలో ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేసే విధంగా పలు సంస్కరణలతో విద్యార్థులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టింది. నిర్ణీత టైంటేబుల్కు లోబడి పాఠ్యాంశాలను పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించింది. ఇంటర్మీడియెట్ నూతన విద్యాసంవత్సరం(2025–26) జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లపై జిల్లా ఇంటర్మీడి యట్ విద్యాధికారి (డీఐఈవో) టి.శేఖర్బాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన వివరాలు ఇలా..
ఏలూరు జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 19 ప్రభుత్వ, 6 సోషల్ వెల్ఫేర్, 3 ట్రైబల్ వెల్ఫేర్, 26 హైస్కూల్ ప్లస్, 3 కేజీబీవీ, 78 ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ తరగతులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు ఎక్కువగా వస్తాయి.
విద్యార్థిమిత్ర పథకం కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది తొలిసారిగా నీట్, ఎంసెట్, తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహించేలా కోచింగ్ మెటీరియల్ను ఉచితంగా ఇవ్వనున్నాం. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ రికార్డు బుక్స్ను కూడా పంపిణీ చేయనున్నాం. ద్వితీయసంవత్సరం ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు గతంలో ఎన్నడూలేని విధంగా టెక్స్ట్ బుక్స్ను ఇస్తున్నాం.
నూతన సంస్కరణల్లో భాగంగా ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో పరిచయం, అవగాహన ఉండాలనే లక్ష్యంలో భాగంగా ఎంచుకున్న గ్రూపు సబ్జెక్టులతోపాటు, అదనంగా ఇతర గ్రూపులోని ఏదైనా ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. పర్యావరణవిద్య పరీక్ష మాదిరిగానే ఆప్షనల్ సబ్జెక్టుపై విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కనీస మార్కులు సరిపోతుంది.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న బోజన పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, బోధనేతర సిబ్బందికి సాధారణ బదిలీలు సోమ వారంలోగా ముగుస్తాయి. నూతన స్థానాల్లో జూన్ 8వ తేదీలోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి సిలబస్ను పూర్తిచేసేలా చర్యలు.
నాడు–నేడు పథకం కింద జూనియర్ కళాశాలల్లో చేపట్టిన నిర్మాణపనులు, టాయిలెట్లు, ప్రహరీలు, ఆర్వో ప్లాంట్లు కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉండగా, మరికొన్నిచోట్ల అన్నీ పూర్తయి వినియోగంలోకి వచ్చాయి.
Updated Date - Jun 01 , 2025 | 12:36 AM