తాడేపల్లిగూడెంలో చెత్తపై జరిమానా
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:32 AM
తాడేపల్లిగూడెం పట్టణం వర్తక వాణిజ్యాలకు పేరు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్తోపాటు ప్రధాన రహదారి పైన వాణిజ్య సంస్థలు విస్తరించాయి.
తోపుడు బళ్లకు రూ.1500, చిన్న హోటళ్లకు రూ.3,000
రోడ్లపై చెత్తను శుభ్రం చేసేందుకేనంటున్న అధికారులు
ఎక్కడా లేని విధంగా వసూళ్లపై పలువురి ఆగ్రహం
తాడేపల్లిగూడెం పట్టణం వర్తక వాణిజ్యాలకు పేరు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్తోపాటు ప్రధాన రహదారి పైన వాణిజ్య సంస్థలు విస్తరించాయి. ఇక్కడి మునిసిపల్ అధికారులు వ్యాపారులపై తొలిసారిగా చెత్తపై జరిమానాను విధించి అమలు చేశారు. పండ్లు, కొబ్బరి బొండాలు, చిరు అల్పాహారాలు అమ్ముతున్న వర్తకుల నుంచి నెలకు రూ.1,500, చిన్న హోటల్స్పై రూ.3 వేలు వరకు జరిమానా విధిస్తున్నారు. దీనిపై వర్తకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పట్టణంలో పెద్ద సంఖ్యలో తోపుడు బళ్లు ఉంటాయి. పండ్లు, కొబ్బరి బొండాలు, ఇతర చిరు వ్యాపారాలన్నీ వీటిపైనే జరుగుతుంటాయి. అటువంటి వీరిపై నెలకు రూ.1500 చొప్పున ప్రతీ నెల లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఓ వైపు సదరు వ్యాపారులు రోజూ వ్యాపారం చేసినందుకు ఆశీలు కడుతున్నారు. తమకు ఇలా రెండు విధాలుగా భారం పడుతోం దని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్, 7(ఆంధ్రజ్యోతి):జగన్ ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీల్లో వేసిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్ని కలలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. కాని, పట్టణా ల్లో వాణిజ్య సముదాయాలపై చెత్త పన్ను వేయ డానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళితే వారు అంగీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి మార్గ దర్శకాలు వస్తేనే పన్ను వసూలు చేయాలని స్పష్టం చేశారు. కాని, తాడేపల్లిగూడెం మునిసిపల్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తూ ఇక్కడ చెత్తపై జరిమానాల పేరిట వసూలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది.
పట్టించుకునేదెవరు ?
చెత్తపై జరిమానా విషయాన్ని వర్తకులు కూటమి నేతల దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. మునిసిపల్ అధికారులు తమ వినతిని పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
అధికారులు ఏమంటారంటే..
రాత్రి పూట రహదారులపై చెత్త లేకుండా శుభ్రం చేసేందుకే ఈ జరిమానాల పేరిట వసూళ్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలోనే చెత్తపై జరిమానా విధించడం ఎంత వరకు సరైనది అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది.
Updated Date - Jun 08 , 2025 | 12:32 AM