గండి పూడ్చండి
ABN, Publish Date - May 21 , 2025 | 12:25 AM
నూజివీడు పెద్ద చెరువుకు గండిపడి 8 నెలలైనా నేటికీ పూడ్చలేదు.
నూజివీడు పెద్ద చెరువుకు గండి
8 నెలలుగా పట్టించుకోని అధికారులు
రామిలేరులో కలుస్తున్న వర్షపు నీరు
భూగర్భ జలమట్టంపై ప్రభావం
నూజివీడు, మే 20 (ఆంధ్రజ్యోతి): నూజివీడు పెద్ద చెరువుకు గండిపడి 8 నెలలైనా నేటికీ పూడ్చలేదు. గత ఏడాది ఆగష్టులో భారీ వర్షాలకు చెరువుకు గండిపడి పట్టణంలో పల్లపు ప్రాంతాలన్ని మునిగాయియి. పట్టణ ప్రజలు మూడురోజుల పాటు ముంపులో ఉండిపోయారు. చెరువుకు ఒక పెద్దగండి, రెండు చిన్నగండ్లు పడ్డాయి. పెద్దగండి పడినచోట రూ.2 కోట్లతో కాంక్రీట్ కట్టలు నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వానికి పంపి ఏడు నెలలైనా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఈ లోపు పలుమార్లు వర్షం పడడంతో చెరువు నీరు రామిలేరులో కలిసిపోయింది. సుమారు 200 ఎకరాలు విస్తీర్ణం గల చెరువులో నీరు నిల్వఉంటే భూగర్భ జల మట్టం పెరిగి ఉండేది. చెరువు కింద ఆయకట్టు విస్తీర్ణం తక్కువగానే ఉన్నా పట్టణంలో భూగర్భ జలాల పెంపుదలకు చెరువు ఇప్పటివరకు ఉపయోగపడుతూ వస్తోంది. చెరువు లో చుక్కనీరు లేకపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లిపోవడమే కాక రాత్రివేళ అక్రమంగా మట్టి తోలకాలు కూడా సాగుతున్నాయి. చెరువు గండ్లను పూడ్చి ఉంటే ఇప్పటివరకు వర్షపు నీరు చెరువుల్లో నిల్వ ఉండేది. అక్రమ మట్టి తోలకాలకు ఆస్కారం ఉండేది కాదు. నూజివీడు పట్టణంలో భూగర్భజలాల మట్టం పెరిగేది.
నిధుల కోసం ఎదురుచూస్తున్నాం
పెద్దచెరువు గండి పూడ్చడానికి రూ.2కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారం. రెవెన్యూ శాఖ పరిశీలించాల్సి ఉంది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో వివిధ చెరువుల మరమ్మతుల కోసం 100 పనులకు అవసరమైన నిధులు కూడా మంజూరు కోసం ప్రభుత్వాన్ని కోరాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.
– వై.అర్జునరావు, ఇరిగేషన్ డీఈ
Updated Date - May 21 , 2025 | 12:25 AM