ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్కు అందలం!
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:57 AM
క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ను ఉన్నతాధికారులు అందలం ఎక్కించారు.
ఏలూరు రూరల్, జూన్ 23 (ఆంధ్ర జ్యోతి): క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ను ఉన్నతాధికారులు అందలం ఎక్కించారు. ఆరోపణలపై విచారణలు, అభియోగాలు నమోదు వంటి చర్యలు మొదలైనప్పటికీ అధికారులు వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా ఇన్చార్జి పదవి కట్టబెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. క్రీడాకారిణుల పట్ల ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో ప్రధాన కోచ్లతో పాటు, సహచర కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కోచ్ల వేధింపులపై కేంద్ర కార్యాలయానికి క్రీడాకారిణులు ఫిర్యాదు చేయడంతో కేంద్ర బృందం రంగంలోకి దిగి అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలడంతో పోలీసులకు కేంద్ర బృందం సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. కేంద్ర బృందం విచారణ అంశాలతో పాటు క్రీడాకారిణుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారం కూడా విచారణ కొనసాగింది.
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఏర్పాటు చేసిన శాయ్ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్లో సుమారు 45 మంది క్రీడాకారిణులు శిక్షణ పొందుతున్నారు. క్రీడాకారిణుల పట్ల సెంటర్ ఇన్చార్జిలతో పాటు కాంట్రాక్టు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడటంతో వారంతా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై బెంగుళూరులో శాయ్ లోని ఇద్దరు సభ్యుల బృందాన్ని విచారణకు పంపింది. ఏలూరు శాయ్ సెంటర్లో గత కొద్ది రోజులుగా రహస్య విచారణ చేపట్టి క్రీడాకారిణుల ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన కోచ్ వినయ్ ప్రసాద్ను తక్షణం బెంగుళూరులోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ తాఖీదు అందింది. అలాగే శాయ్ సెంటర్ ఏలూరు ఇన్చార్జిగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ సందీప్ను శాయ్ సెంటర్ ఇన్చార్జిగా నియమిస్తూ సౌత్ సెంట్రల్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అతనిపై విచారణలో ఏం తేలిందో వెలుగులోకి రాకుండా ఇన్చార్జిగా నియమించడం పట్ల క్రీడాకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:57 AM