మట్టి మాఫియా
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:12 AM
నూజివీడు నియోజక వర్గంలో మట్టి మాఫియా బరి తెగించింది.
నూజివీడులో ఇటుక బట్టీల చెంతకు మట్టి
చెరువుల్లో అక్రమ తవ్వకాలు
ఏడాదికి రెండు కోట్లు డీల్!
పట్టించుకోని యంత్రాంగం
చెరువు లోతు పెరిగి రైతులకు నీరందని పరిస్థితి
అధికార పార్టీ నేతల దందా
నూజివీడు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నూజివీడు నియోజక వర్గంలో మట్టి మాఫియా బరి తెగించింది. గతంలో రైతు, గృహా వసరాలకు చెరువు ల్లో మట్టిని వినియోగించుకునేవారు. ఆ పేరుతో మట్టి మాఫియా చెరువుల్లో మట్టిని దూరప్రాంతాలకు, వెంచర్లకు విక్రయించేది. బయటకు పొక్కితే అక్రమ తవ్వకాలు ఆగిపోయేవి. కొద్ది నెలల నుంచి నూజివీడు నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో విస్తరిస్తోంది. ఆగిరిపల్లిలోని పలు గ్రామాలు, నూజివీడు మండలంలోని కొన్నంగుంట, బోర్వంచ, దేవరగుంట, జంగంగూడెం, రావిచర్ల, మొర్సపూడి గ్రామాల్లోని చెరువు మట్టి అక్ర మంగా తరలివెళుతోంది. అక్రమ తవ్వకాల గురించి గ్రామస్తులు రెవెన్యూ, మైన్స్ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామ సమీపంలో వందెకరాల విస్తీర్ణం గల పంగిడమ్మ చెరువుపై మట్టి మాఫియా కన్నుపడింది. అధికార పార్టీ చోటా నాయకులు కొందరు చెరువులో మట్టి అమ్మకాలు చేపట్టి సమీప ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మట్టి హోం డెలివరీ!
ఆగిరిపల్లి మండల సమీపంలోని అనేక గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. బట్టీల నిర్వాహకులు మట్టిని సుదూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో మట్టిని తెచ్చుకునేవారు. శోభనాపురం, ఈదర, మాదలవారిగూడెం, సమీపంలోని మైలవరం మండలానికి చెందిన వెల్వడం, గణపవరం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఇటుక బట్టీలవారితో మాఫియా కుమ్మక్కై కావాల్సిన మట్టిని అడిగిన సమయానికి బట్టీల వద్దకు పంపించడానికి ఒప్పందం కుదు ర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ ఏడాదికి రెండు కోట్లుగా వినిపిస్తోంది. మొన్నటివరకు చాటుమాటుగా అక్రమంగా మట్టిని కొనుగోలు చేసుకునే ఇటుక బట్టీలకు అధికార పార్టీ నేతలే హోం డెలివరీ చేస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని మట్టి మాఫియా నియోజకవర్గంలో వీలైన చోట్ల చెరువుల్లో మట్టి అక్రమంగా తరలి స్తోంది. నియోజకవర్గంలో ఒక మూ లన ఉండే ఈదర ప్రాంతంలోని పంగిడమ్మ చెరువుపై ప్రస్తుతం ఈ ముఠా చూపు పడింది. నీరులేక ఎండిన వందెకరాల చెరువులో రాత్రివేళ మట్టి తవ్వ కాలు సాగిస్తు న్నారు. గ్రామస్తులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఈదర, కొత్త ఈదర, సీతారామపురం గ్రామాల రైతులు చెబుతున్నారు.
రైతులకు తీవ్ర నష్టం
నియోజకవర్గంలో సాగునీటి చెరువుల ఆధా రంగా రైతులు పంట పండిస్తారు. చేలలకు నీరు సరఫరా కోసం చెరువు కట్టలలో తూముల ను ఏర్పాటుచేసి ఉంటాయి. చెరువు లోతు నిబంధనలకు మించి పెరిగితే తూములకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆం దోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలతో చెరువుల లోతు పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. చెరువులు నిండినప్పుడు అధిక లోతు వల్ల తమ పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. మట్టి అక్రమ తవ్వకాలతో లబ్ధిని చూసి ఇతర మండలాల నాయకులకు సైతం దీనిపై దృష్టిసారిస్తున్నారు.
విచారణ జరపాలి
నూజివీడు, గన్నవరం, మైలవరం నియోజకవ ర్గాల్లోని ఇటుక బట్టీలకు అందుతున్న మట్టి గురించి విజిలెన్స్ విచారణ జరిపితే మట్టి మాఫియా ఆగడాలు, దోపిడీ బయటపడుతుందన పలువురు చెబు తున్నారు. ‘సెస్’ విధించడం ద్వారా ప్రభుత్వానికి కోల్పోయిన ఆదా యాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉంటుంది.
Updated Date - Apr 21 , 2025 | 12:12 AM