రూప్ చంద్ ధర పతనం
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:34 AM
రూప్చంద్ చేపల ధర అత్యంత కనిష్ఠ స్థాయికి చేరడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
పట్టుబడితో నష్టం.. జాప్యమైతే మేత భారం!
కిలో కనిష్ఠ ధర రూ.93
వ్యాపారుల మార్జిన్ రూ.4
పెట్టుబడి కూడా దక్కదు
మేత మరింత భారం
ఆక్వా రైతు కుదేలు
నిడమర్రు, జూలై 7(ఆంధ్రజ్యోతి): రూప్చంద్ చేపల ధర అత్యంత కనిష్ఠ స్థాయికి చేరడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. జూన్ ఆఖరి వారం నుంచి ధర పతనం అవుతోంది. వేసవిలో రైతు వద్ద కిలో రూ.128 పలికిన రూప్చంద్ చేప ధర ప్రస్తుతం రూ.95 ఉంది. ఒక కేజీకి సుమారు రూ.30 రైతు ధర కోల్పో తున్నాడు. కేజీ చేప పెంపకానికి రూ.95 నుంచి రూ.100 వరకు ఖర్చవుతుండడంతో సుమారు రూ.7 నష్టపోతున్నాడు. 10 టన్నుల సరుకు ఎగు మతికి సుమారు రూ.1.5 లక్షల నష్టం వస్తోంది.
సొమ్ము చెల్లిస్తేనే మేత
రూప్చంద్ చేప ధర కనిష్ఠ స్థాయికి చేరడం తో చేపలు పట్టడానికి రైతుల ముందుకు రావ డం లేదు. ప్రస్తుత సీజన్ ఆరంభం నుంచి చేపల మేతకు ఫీడ్ కంపెనీలు, డీలర్లు పెట్టుబడి పెడుతున్నారు. పట్టుబడి అనంతరం రైతుకు సొమ్ము అందిన తర్వాత వారికి చెల్లిస్తారు. ప్రస్తు తం పట్టుబడి లేకున్నా చేపకు మేత వేయాల్సిం దే. సొమ్ము చెల్లిస్తేనే మేత పంపుతామంటూ డీలర్లు షరతులు విధిస్తున్నారు. దీనితో రెండు రోజులకోసారి రైతులు మేత వేస్తున్నారు. ఈ కారణంతో చేప బరువు తగ్గి మరింత నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు నెలలు శ్రావణ మాసం పూజలు, వినాయకచవితి, దీపావళి అంటూ వచ్చే 5 నెలలు చేపల మార్కెట్కు గడ్డుకాలమే. మార్కెట్ మరింత తగ్గే అవకాశం ఉంటుందని ట్రేడర్స్ చెబుతున్నారు. పెరిగిన చేప నష్టానికి అమ్మలేక చేపల రైతు గట్టున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకొంటున్నాడు. కనీసం చెరువు లీజు సొమ్ము కూడా దక్కదని వాపోతున్నారు.
వ్యాపారుల మార్జిన్.. రైతుకు భారం
రూప్చంద్ చేప సైజును బట్టి ధర పలికేది. కేజీ ధరలో ట్రేడర్స్ ధర 1 గ్రాముకు 2 పైసలు చొప్పున కేజీ చేపకు వంద గ్రాములు మార్జిన్గా తీసుకుంటారు. ప్రస్తుతం రైతు పరిస్థితిని ఆసరా గా చేసుకున్న ట్రేడర్స్ మరింత కోత వేస్తున్నారు. మార్జిన్ రేటును 2 పైసల నుంచి 4 పైసలకు చేసి రైతులను దోచుకుంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఒక కేజి ధర రూ.93 పలికితే ట్రేడర్ మార్జిన్ వంద గ్రాములు పోను 900 గ్రాములకు రూ.89 ధర దక్కుతోంది. 1 గ్రాముకు 4 పైసల చొప్పున వంద గ్రాముల ధర రూ.4 మొత్తం కేజీ ధరలో కోత వేస్తున్నారు. మార్జిన్ మొత్తం తీసివేస్తే రైతుకు రూ.89 లభిస్తోంది. గతంలో 2 పైసలు ప్రస్తుతం 4 పైసలు చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఆక్వా రైతుకు ధరాఘాతం
నిలకడగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా పతనం కావడంతో రైతులకు ధర క్షీణత శరఘాతమైంది. పట్టుబడుల వేళ ఒక్కసారిగా ధర కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల కొన్ని ప్రాంతాలలో 1 గ్రాముకు 4 పైసలు చొప్పున తక్కువ ధర కడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనితో కేజీ బేసిక్ ధరపై రూ.4 కోత పడుతోంది. ట్రేడర్స్తో మాట్లాడతాం.
తాడినాడ బాబు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ అసోషియేషన్
మేత ధర కూడా రావడం లేదు
20 ఎకరాల్లో రూప్చంద్ సాగుచేస్తున్నాను. ధర పతనం కావడంతో గిట్టుబాటు కావడం లేదు. కనీసం మేత రేటు కూడా దక్కడం లేదు. లీజు చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం చర్యలు తీసుకుని మేత ధర తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. లీజు తగ్గినా చెరువులు చేయలేకపోతున్నాం. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఆదుకోకపోతే రోడ్డుపడాల్సి పరిస్థితి నెలకొంది.
జి.చిన్నారావు, రైతు, ఫత్తేపురం
Updated Date - Jul 08 , 2025 | 12:34 AM