వ్యవసాయ మార్కెట్ కమిటీల రిజర్వేషన్ గందరగోళం
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:12 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంలో జిల్లా అధికారులు దోబూచులాడుతున్నారు. పాలకవర్గ కమిటీ చైర్మన్ రిజర్వేషన్ తరచు మార్పులు చేస్తున్నారు.
తరచూ మార్పులు చేస్తున్న జిల్లా అధికారులు
ఇన్చార్జి మంత్రి సీరియస్
పాత రిజర్వేషన్లే మళ్లీ ఖరారు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంలో జిల్లా అధికారులు దోబూచులాడుతున్నారు. పాలకవర్గ కమిటీ చైర్మన్ రిజర్వేషన్ తరచు మార్పులు చేస్తున్నారు. ఇది నియోజకవర్గాల్లో గందరగోళానికి గురిచేస్తోంది. గతంలో రిజరే ్వషన్లు ప్రకటించడమే కాకుండా ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి మార్కెట్ కమిటీలను నియమించేశారు. రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు మార్పు చేస్తూ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ కమిటీలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6న మార్పు చేసిన రిజర్వేషన్లను ఏఎంసీలకు పంపించారు. ఈ విషయం అధిష్ఠానానికి వెళ్లింది. జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా మార్పులను సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు మార్పు చేయడంపై జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు. మార్కెటింగ్ కమిషనర్ సైతం కారాలు మిరియాలు నూరారు. రిజర్వేషన్ల మార్పు విషయంలో జిల్లాలో పెద్ద చర్చకే దారితీసింది. ఎవరికితోచిన రీతిలో వారు సోషల్ మీడియాలో స్పందించారు. ఆశావహుల్లోనూ అసంతృప్తి చెలరేగింది. ఇప్పటికే ఏఎంసీ చైర్మన్లుగా ప్రకటించడంతో వారంతా మనోవేదనకు లోనయ్యారు. ఇదంతా గ్రహించిన ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధికారులపై సీరియస్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. దాంతో మూడు నెలలు క్రితం ప్రకటించిన రిజర్వేషన్లనే ఖరారు చేస్తూ ఈ నెల 8న మళ్లీ ఉత్తర్వులు జారీచేశారు.
Updated Date - Jul 10 , 2025 | 12:12 AM