జగన్ రీసర్వే.. మాయాజాలం!
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:37 AM
అధికారుల బాధ్యతారాహిత్యం.. గత వైసీపీ పాలకుల అలసత్వం వెరసి.. నిరుపేదల కుటుంబాలను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది.
తల్లికి వందనానికి శాపం
సెంటు భూమి లేకున్నా భూస్వాములను చేసేశారు
వ్యవసాయ కూలి పేరిట 118 ఎకరాలు.. వడ్రంగికి 46 ఎకరాలు
గత ప్రభుత్వ హయాంలో విచిత్రాలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
అధికారుల బాధ్యతారాహిత్యం.. గత వైసీపీ పాలకుల అలసత్వం వెరసి.. నిరుపేదల కుటుంబాలను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. జగన్ సర్కార్ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వే పేదల పాలిట శాపంగా మారింది. నిరుపేదలను భూస్వాములుగా చూపడంతో ప్రస్తుతం వారి పిల్లలు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మండవల్లి/ముదినేపల్లి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూముల రీసర్వేకు నిర్ణయించి హైదరాబాద్కు చెందిన సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. ఆ సంస్థ సిబ్బంది డ్రోన్ల ద్వారా భూమి సర్వే చేసి రికార్డుల్లో రైతుల భూవివరాలు నమోదు చేశారు. డ్రోన్ సర్వే అనంతరం సర్వేచేసిన భూమి మీద వాస్తవ పరిస్థితులు, ఎవరి ఆధీనంలో ఉంది ? ఎవరు భూ యజమానులు, ఎవరు హక్కుదారులు ? అని నిర్ధారించు కోవాల్సి ఉంది. గ్రామసభ ద్వారా ఆ భూములు వివరాలు రైతులకు యజమానులకు తెలిపి ఫారం 54 ద్వారా యజమానుల నుంచి ఒప్పంద పత్రం తీసుకోవాలి. అధికారులు అవేవి చేయకుండా నిరుపేదల జీవితాలతో చెలగాటమాడారు.
మండవల్లికి చెందిన షేక్ బాజీ తన తాత, తల్లిదండ్రుల కాలం నుంచి పంట కాలువ పక్కన ఇరిగేషన్ పోరంబోకు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకొని కూలి పనులు, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ పనికి వెళ్లాందే ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి కుటుంబానిది. కానీ సర్వే నంబర్ 948లో 118 ఎకరాలు ఉన్నట్టు ఆన్లైన్లో చూపడంతో అతను అవాక్కయ్యాడు. తన కుమార్తె షేక్ నాజీయా చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నాడు.
మండవల్లికి చెందిన వల్లూరి ప్రసాద్ వడ్రంగి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనితో పాటు తమ్ముడి కుటుంబం చిన్నపాటి రేకుల షెడ్డులో ఉంటున్నారు. అతని కుమారుడు నాగరంగ వెంకట సత్యప్రసాద్కు ‘తల్లికి వందనం’ సొమ్ము జమ కాకపోవడంతో కారణం తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లగా ‘నీ పేరిట 46 ఎకరాలు ఉన్నట్టు ఆన్లైన్లో చూపుతోంది’ అని సిబ్బంది తెలపడంతో ఖంగుతిన్నాడు.
జన్ను శివనాగ రాజు వ్యవ సాయ పనులు చేసుకుం టూ పంటకాల్వ పక్కన ఇరిగేషన్ స్థలంలో షెడ్డు వేసుకుని జీవిస్తున్నాడు. అతనికి 47 ఎకరాలు ఉన్న ట్టు చూపడంతో కుమార్తె జస్వంత్ సాహితి తల్లికి వందనం పథకానికి అనర్హులిగా తేలింది.
మండవల్లిలోని కైకలూరు సందులో నివాసం ఉన్న శాయన కృష్ణ సురేష్కు 20 సెంట్లు భూమి ఉండ గా 17 ఎకరాలు ఉన్నట్టు రికార్డులో నమోదు అయ్యింది. దీంతో అతని కుమారుడు నిఖిలేశ్వరకార్తీక్ను అనర్హుడిగా ప్రకటించారు.
మండవల్లికి చెందిన ఆగోల్లు శ్రీనివాసరావుకు సెంటు భూమి లేదు. అతను వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే పరిస్థితి. అతనికి 14 ఎకరాలు ఉన్నట్టు చూపడంతో కుమారులు రేవంత్కుమార్, నాగశరణ్యలకు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు.
ముదినేపల్లికి చెందిన పోలగాని సత్యనారాయణకు మండవల్లిలో 17 ఎకరాలు ఉన్నట్లు రికార్డులో ఉండడం తో వారం రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.
అర్హులైనా అందని వందనం
ముదినేపల్లి మండలం పేరూరు, పెయ్యేరు గ్రామాల్లో అర్హులైన పలు కుటుంబాలు తల్లికి వందనం లబ్ధిని పొంద లేకపోయాయి. పేరూరుకు చెందిన రెండు కుటుంబాల పేరున ఒకే సర్వే నంబర్లో 128 ఎకరాల భూమి వెబ్ ల్యాండ్లో చూపించడంతో అనర్హుల జాబితాలో చేరాయి. వాస్తవానికి ఒకరికి 1.28 సెంట్లు భూమి, మరొకరికి 75 సెంట్లు భూమి ఉండగా గత ప్రభుత్వం నిర్వహించిన జోన్ రీసర్వే కారణంగా జాయింట్ ఎల్పీలు నమోదు కావడంతో వారి పేరున ఎక్కువ విస్తీర్ణం గల భూములను చూపిస్తు న్నాయి. దీంతో ఆ కుటుంబాలు ఇద్దరు పిల్లలు ఉండి అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం అనర్హుల జాబితాలోనే మిగిలిపోయారు.
పెయ్యేరులో శాంతి అనే మహిళ పేరున విద్యుత్ మీట రు లేకపోయినా ఆ కుటుంబం సగటును 300 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్టు ఆన్లైన్లో చూపించి తల్లికి వందనం జాబితాలో అనర్హురాలిగా పేర్కొన్నారు. ఆమె బుధవారం ఆ పాఠశాలకు వచ్చి హెచ్ఎంను కలిసి తనకు తల్లికి వందనం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కాలేదని చెప్పగా దీనిపై ఆరాతీస్తే విద్యుత్ వినియోగం ఎక్కువ ఉన్నట్లు తప్పుగా నమోదైనట్టు తెలిసింది.
Updated Date - Jun 19 , 2025 | 12:37 AM