హాస్టల్ భవనాలకు రూ.12 కోట్లు
ABN, Publish Date - May 25 , 2025 | 12:25 AM
ఏలూరు జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను రూ.12 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తునట్లు సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ ఎం.ముక్కంటి చెప్పారు.
రూ.5.72 కోట్లతో మరమ్మతులు
జూన్ నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు
సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ముక్కంటి
ఏలూరు రూరల్, మే 24 (ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను రూ.12 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తునట్లు సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ ఎం.ముక్కంటి చెప్పారు. ఏలూరు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కైకలూరు, పెదపాడు, గండుగొలను, ముదినేపల్లిలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో రూ.12 కోట్లతో కొత్త భవనాలు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని, వాటిలో 53 ప్రభుత్వ భవనాల్లో, 6 ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 59 వసతి గృహాల్లో 27 బాలుర వసతి గృహాలలో 1,766 మంది విద్యార్థులు, 32 బాలికల వసతి గృహాల్లో 2,694 మంది విద్యార్థినులు వసతి పొదుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే భవనాలలో 52 భవనాలు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.72 కోట్లు మంజూరు చేసిందన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జూన్ మొదటివారం నాటికి భవనాల మరమ్మతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 56 సంక్షేమ వసతి గృహాల్లో 448 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 6,900 మంది ప్రవేశాలు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో 87శాతం, ఇంటర్మీడియట్లో 89 శాతం హాస్టల్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి తెలిపారు.
పూళ్ల హాస్టల్లో సమీక్ష
భీమడోలు:రానున్న విద్యాశాఖ సంవత్సరంలో అధికారులు సమన్వ యంతో పనిచేసి హాస్టల్స్ అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకోవాలని జేడీ ముక్కంటి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం భీమడోలు మండలం పూళ్ల ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంగుటూరు పరిధిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఉంగుటూరు పరిధిలోని నిడమర్రు, ద్వారకాతిరు మల, భీమడోలు, ఉంగుటూరు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. సర్పంచ్ సుజాత ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 12:25 AM