ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:48 AM
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
గర్భిణికి కాల పరిమితి ముగిసిన ట్యాబ్లెట్స్
ఏలూరు జిల్లా ఆస్పత్రిలో నిర్వాకం
ఏలూరు క్రైం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైద్యవిధాన పరిషత్లో ఉన్నప్పుడు ఉత్తమ సేవ లతో జాతీయ స్ధాయిలో రెండు పర్యాయాలు అవార్డులు అందుకుంది. మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రిగా మారిన తరువాత సేవలు అథమ స్థాయికి చేరుకున్నా యని విమర్శలు వస్తున్నాయి. వైద్యసేవలు ఎలా ఉన్నా మందులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక గర్భిణికి గడువు ముగిసిన మందులను ఇవ్వడంతో అవాక్కైంది. బిడ్డ, తల్లి ప్రాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరి స్తారా అని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు రూరల్ మండలం పాలగూడెం గ్రామానికి చెందిన భవాని మూడు నెలల గర్భిణి. కుటుంబ సభ్యు లు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రి తల్లి బిడ్డల విభాగంలో వైద్య సేవల కోసం తీసుకువచ్చారు. ఈనెల 10న జనరల్ చెకప్ చేసి వివిధ ల్యాబ్ పరీక్షలను కూడా చేశారు. ఆ పరీక్షలను ఈనెల 11న తీసుకుని తిరిగి వైద్యుల వద్దకు వెళ్లగా ఆమెకు మందులు రాయడంతో అదే భవనంలో ఉన్న ఫార్మసీ కౌంటర్లో ఉదయం మందులు తీసుకున్నారు. మొత్తం నాలుగు రకాల మందులు రాయగా వాటిలో డాక్సిలామైన్ సక్సినేట్ (నిద్రపట్టడానికి వాడేవి) టాబ్లెట్స్పై కాలపరిమితి 2025 మే వరకూ మాత్రమే ఉంది. వాటిని గర్భిణికి పంపిణీ చేశారు. భవానీ కుటుంబ సభ్యులు ఆమెకు టాబ్లెట్స్ వేసే ముందు గడువు తేదీ చూసి కంగారుపడ్డారు. చూడకుండా వేసుకుంటే తల్లి బిడ్డ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. తమతో పాటు ఈ మాత్రలు ఎంత మందికి ఇచ్చారో.. వాళ్ల పరిస్థితి ఏమవుతుందో ఏమిటోనంటూ ఆందోళనకు గురయ్యారు. ఈ విషయా న్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.శశిధర్ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని శుక్రవారం ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణంగా ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ను ముందుగానే తీసి వేస్తారని కాని డిస్పెన్సరీకి ఎవరు ఇచ్చారు. అక్కడ నుంచి పంపిణీ ఎలా జరిగాయి అనే దానిపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - Jun 13 , 2025 | 12:48 AM