పది పరీక్షల్లో 77.24 శాతం ఉత్తీర్ణత
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:23 AM
పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 77.24శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 21వ స్థానం దక్కింది. గత ఏడాది ఉత్తీర్ణతతో పోల్చితే ఈ ఏడాది 3 శాతం తగ్గినప్పటికీ, రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలవగా ప్రస్తుతం 21 స్థానంలో ఉండడం ఊరట కలిగించే విషయం.
రాష్ట్రంలో 21 స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా
పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 77.24శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 21వ స్థానం దక్కింది. గత ఏడాది ఉత్తీర్ణతతో పోల్చితే ఈ ఏడాది 3 శాతం తగ్గినప్పటికీ, రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలవగా ప్రస్తుతం 21 స్థానంలో ఉండడం ఊరట కలిగించే విషయం. జిల్లాలో పది పరీక్షలకు మొత్తం 22,365 మంది విద్యార్థులు హాజరుకాగా, 17,274మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 11,197 మందికి 9,128మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 11,168మందికి 8,146 మంది విజయం సాధించారు.
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పది పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానం మెరుగుపడినా ఉత్తీర్ణతా శాతం గత ఏడాది కంటె తగ్గింది. మెరుగైన ఫలితాలకోసం అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో పండుగ రోజులు, సెలవు దినాలు సహా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తుది ఫలితాల్లో ఆశించిన ఉత్తీర్ణత దక్కలేదు. ఈ ఫలితాలు ‘నిజంగా కష్టపడి చదివి’ పరీక్షలు రాసిన విద్యార్థులవని ఒక విద్యాధికారి విశ్లేషించగా, ప్రాథమిక స్థాయి నుంచి పునాది లేకుండా ఒకేసారి టెన్త్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు ఆశించడం సరికాదని మరో విద్యాధికారి అభిప్రాయ పడ్డారు. బాగా చదివేవారిని విభజించి వారికి పాఠ్యాంశాల బోధన కొనసాగిస్తూనే, వెనుకబడిన విద్యార్థులకు తొలి మూడు నెలల కాలంలో చదవడం, రాయడం వంటి బేసిక్స్పై తర్ఫీదు నిచ్చిన అనంతరమే పూర్తిస్థాయిలో బోధించడం ద్వారా మంచి ఫలితాలను తీసుకురావచ్చని సుదీర్ఘ అనుభవం ఉన్న మరో విద్యాధికారి పేర్కొన్నారు.
‘ఓపెన్’ టెన్త్లో వైఫల్యం
దూరవిద్య పరీక్షల నిర్వహణలో జిల్లాలో కఠినతరమైన తనిఖీల ప్రభావంతో అభ్యాసకులు పొరుగు జిల్లాలకు వెళ్లిపోతున్న విషయం విదితమే. ఈ ఏడాది ఓపెన్ స్కూల్స్ టెన్త్ పరీక్షలకు జిల్లాలో 746మంది విద్యార్థులు హాజరుకాగా కేవలం 92మంది (12.33శాతం)మాత్రమే ఉత్తీర్ణత సాధిం చారు. పరీక్షల్లో ‘ఓపెన్ బుక్’ పద్ధతిని నిరోధిస్తుండడమే జిల్లాలో ఉత్తీర్ణత భారీగా తగ్గిపోడానికి కారణమని ఓ విద్యాధి కారి కుండబద్దలుకొట్టారు. ఇక దూరవిద్య ఇంటర్మీడియట్ పరీక్షలకు 955 మంది విద్యార్థులు హాజరుకాగా 366మంది (38.32శాతం) ఉత్తీర్ణులయ్యారు. వచ్చేనెల 19 నుంచి జరిగే దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షలకు టెన్త్ విద్యార్థులు సబ్జెక్టు ఒక్కింటికి రూ.100చొప్పున, ఇంటర్ విద్యార్థులు సబ్జెక్టు ఒక్కిం టికి రూ.150చొప్పున ఈ నెల 26నుంచి మే 5వ తేదీవరకు ఏపీ ఆన్లైన్ద్వారా చెల్లించాలని డీఈవో సూచించారు.
వెనుకబడిన జడ్పీ ఉన్నత పాఠశాలలు
పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో సంఖ్యాపరంగా జిల్లాలోని 179 జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 10,161మంది హాజరుకాగా, వీరిలో 6612మంది (65.07శాతం) ఉత్తీర్ణుల య్యారు.178 ప్రైవేటు అన్ఎయిడెడ్ హైస్కూళ్ల నుంచి మొత్తం 8405 మంది బాలబాలికలు హాజరుకాగా 7974మంది (94.87 శాతం) విజయం సాధించి జిల్లాలో టాప్స్థానంలో నిలిచారు. ఇక పరీక్షలకు వందల సంఖ్యలోనే విద్యార్థులు హాజరైన ఎయి డెడ్ పాఠశాలల నుంచి 572 మందికి 379 మంది, ఏపీ రెసిడెన్షియల్ 238 మందికి 236, బీసీ వెల్ఫేర్ 40 మందికి 38, ప్రభుత్వ హైస్కూల్స్లో 518 మందికి 290, కేజీబీవీ 107 మందికి 104, మునిసిపల్ పాఠశాలల నుంచి 761మందికి 481, సోషల్వెల్ఫేర్ 621 మందికి 557, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 618 మందికి 427, ట్రైబల్వెల్ఫేర్ ఆశ్రం గురుకులాల్లో 324 మందికి 176మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులలో అత్యధికంగా ఫస్ట్ డివిజన్లో 7169మంది ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల నుంచి ఉండగా, తదుపరి స్థానంలో 3925మందితో జడ్పీ హైస్కూళ్లు ఉన్నాయి. ఏలూరులోని పాఠశాలల్లో జిల్లాలోనే అత్యధికంగా 838 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.
వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్యూర్స్..
పది పరీక్షలు రాసిన విద్యార్థులు 5091 మంది ఉండగా, అత్యధికంగా 3549 మంది జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచే ఉండడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఫెయిలైన మొత్తం బాలబాలికల్లో తెలుగు సబ్జెక్టులో 1328 మంది, హిందీ 626, ఇంగ్లీషు 2221, గణితం 3734, సైన్స్ 3225, సోషల్ స్టడీస్ 2945 మంది ఉన్నారు.
ఫలితాలపై సంతృప్తి
పది పరీక్ష ఫలితాలపై ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాల కోసం కృషిచేస్తాం. ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం ఆయా హైస్కూళ్లలో ప్రత్యేక తరగతులను ప్రారంభిస్తాం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే బాలబాలికలు మే 1లోగా సంబందిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 19 నుంచి 28 వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజును అపరాధ రుసుంలేకుండా ఈ నెల 30 వరకు, రూ.50 ఫెనాల్టీతో పరీక్ష తేదీ ముందు రోజు వరకు చెల్లించే వెసులుబాటు ఉంది.
– వెంకటలక్ష్మమ్మ, డీఈవో
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు పోటాపోటీ
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు పోటీపడ్డారు. అందరికంటే అత్యధికంగా ఏలూరు శాంతినగర్ ఆక్స్ఫర్డ్ హైస్కూలు విద్యార్థిని బళ్ల గగనశ్రీ 597/600 స్ట్రైక్ రేట్తో మార్కులు సాధించి ఈ ఏడాది ‘పది’ పరీక్షల జిల్లా టాపర్గా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు వ్యాపార రంగంలో ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లలో ఆగిరిపల్లి మండలం ఎం.సురవరం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి గిడుతూరి జనార్థన్ బాబు 588మార్కులు, మండవల్లి మండలం లింగాల జడ్పీ హెచ్ఎస్ విద్యార్థి బాసా ధీరజ్సాయి విశాల్ 587 మార్కులు, కలి దిండి జడ్పీహెచ్ఎస్ నాయుడు హర్షవర్థిని, కామవరపుకోట జడ్పీహెచ్ఎస్ చిలుకుబత్తుల సూర్యదీప్తిలకు 586 మార్కులు సాధించారు. చింతలపూడి జడ్పీహెచ్ఎస్ కానూరి పూజిత 585, పెదపాడు మండలం వీరమ్మకుంట జడ్పీహెచ్ఎస్ కలిపిండి నిహారిక 584, ఏలూరు రూరల్ మండలం శనివారపుపేట జడ్పీహెచ్ఎస్ సుంకర లక్ష్మీపూజ 583, ఆగిరి పల్లి జడ్పీ హెచ్ఎస్ నక్కా హేమ నాగ త్రివేణి, మండవల్లి జడ్పీహెచ్ఎస్ నండూరి లక్ష్మీసంహితలకు 582 మార్కులు చొప్పున, కైకలూరు జడ్పీహెచ్ఎస్ సేకం ప్రణతి వైష్ణవి, ఏలూరు శనివారపుపేట జడ్పీ హెచ్ఎస్ అడిగర్ల నవీన్కు 581 మార్కులు చొప్పున వచ్చాయి.
నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు
చాట్రాయి మండలం సి.గుడిపాడు జడ్పీ హెచ్ఎస్, ద్వారకాతిరుమల జడ్పీ హెచ్ఎస్, కుక్కునూరు మండలం వేలేరు కేజీబీవీ, నూజివీడు మండలం అగిరిపల్లి జడ్పీ హెచ్ఎస్, అప్పలరాజుగూడెం ఏపీ రెసిడె న్షియల్ స్కూలు నూరుశాతం ఉత్తీర్ణతను నిలబెట్టుకున్నాయి.
Updated Date - Apr 24 , 2025 | 01:23 AM