Underdeveloped ITIs అభివృద్ధి లేని ఐటీఐలు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:19 AM
Underdeveloped ITIs విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపాలన్న ఉద్దేశంతో పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ) ఏర్పాటు కాగా నేడు అవి ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతున్నాయి.
అభివృద్ధి లేని ఐటీఐలు
సిబ్బంది కొరత
పాత భవనాల్లోనే బోధన
ఏటా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ
ఆ స్థాయిలో కనిపించని ఉపాధి
రాజాం, జూన్ 29(ఆంధ్రజ్యోతి):
విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపాలన్న ఉద్దేశంతో పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ) ఏర్పాటు కాగా నేడు అవి ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా ఆరు వేల మంది వరకూ ఐటీఐలో చేరుతున్నారు. అదే స్థాయిలో చదువు పూర్తి చేస్తున్నారు. ఎలక్ర్టానిక్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, సివిల్ డ్రాఫ్ట్మెన్ వంటి కోర్సులు ఉన్నాయి. కానీ ఎన్ని క్యాంపస్ డ్రైవ్లు జరుగుతున్నాయి? ఎంతమందికి ఉపాధి దొరికింది? ఎందరు ఉద్యోగాలు పొందుతున్నారు? అంటే మాత్రం సమాధానం లేదు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. విజయనగరం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం ఐటీఐలను సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పాత భవనాల్లోనే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తగినంతమంది సిబ్బంది కూడా లేరు. కొద్దిరోజులుగా శాశ్వత నియామకాలు లేవు. కాంట్రాక్ట్ సిబ్బందే ఆధారంగా ఉన్నారు. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 14 యూనిట్లకుగాను శిక్షణ ఇచ్చే సిబ్బంది ఇద్దరు మాత్రమే. వీరిలో ఒకరే రెగ్యులర్. మరొకరు కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈ ఐటీఐలో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. ట్రేడ్కు తగ్గట్టు శిక్షణనిచ్చేవారు మాత్రం లేరు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ సంస్థ గుర్తింపు దక్కినా శిక్షకుల పోస్టులు మాత్రం మంజూరు చేయడం లేదు. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో నలుగురు రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ శిక్షకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 24 యూనిట్లలో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. సిబ్బంది కొరత ఒక వైపు, ఇరుకు గదుల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు ఐటీఐల వైపు మొగ్గుచూపుతున్నారు. సిబ్బందిపరంగా రాజాం, సాలూరులో ఫర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఐటీఐల ఏర్పాటుతోనే శిక్షకులను నియమించారు.
ఆదరణ ఉన్నా..
ఐటీఐ అంటే విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐలను తీర్చిదిద్దలేకపోతున్నారు. పదో తరగతి తరువాత ఎక్కువ మంది ఐటీఐ విద్యవైపు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వపరంగా విద్యుత్, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 2019లో సచివాలయాల విద్యుత్ లైన్మెన్లు, సర్వేయర్ పోస్టులు వేలాదిగా భర్తీ అయ్యాయి. ఆ సమయంలో ఐటీఐ ఎలక్ర్టానిక్, సివిల్ డ్రాఫ్ట్మెన్ కోర్సులు చేసిన వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత ఐటీఐకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని ప్రైవేటు ఐటీఐల తీరుపై విమర్శలు ఉన్నాయి. జిల్లా వారిని కాకుండా చత్తీస్గడ్, ఒడిశా విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
బలోపేతానికి చర్యలు
జిల్లాలో ఐటీఐ బలోపేతానికి అన్నిచర్యలు చేపడుతున్నాం. వసతితో పాటు సిబ్బంది కొరత విషయంపై ప్రభుత్వానికి నివేదించాం. ఉన్నంతలో మంచిగానే శిక్షణ అందిస్తున్నాం. జిల్లాకు ఉద్యోగ మేళాలను రప్పించేలా చూస్తున్నాం.
- టీవీ గిరి, జిల్లా ప్రభుత్వ ఐటీఐల కన్వీనర్, విజయనగరం
----------
Updated Date - Jun 30 , 2025 | 12:19 AM